Odisha Train Accident live updates(Telugu breaking news): ఒడిశాలో ఘోరకలి. మూడు రైళ్లు ఢీ కొన్నాయి. మాటలకు అందని మహా విషాదం ఇది. రైలు ప్రమాదం అంతులేని వ్యధను మిగిల్చింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 233 మందిపైగా ప్రయాణికుల ప్రాణాలను ఛిదిమేసింది. మరో 900 మంది గాయపడ్డారు. ఇంకా మృత్యుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తీవ్రంగా గాయపడ్డ వారు చికిత్స పొందుతూ ఆస్పత్రుల్లోనే కన్ను మూస్తున్నారు.
ఘటనాస్థలంలో జరుగుతున్న సహాయక చర్యల్లో మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. రైల్వే శాఖ నిర్లక్ష్యం అభం శుభం తెలియని ప్రయాణికులను బలి తీసుకుంది. 3 రైళ్లు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో గమ్యం చేరకముందే ప్రయాణికులను మృత్యువు కాటేసింది. బోల్తాపడిన బోగీల్లో ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉండొచ్చనేది అధికారులు సరిగా అంచనా వేయలేకపోతున్నారు. ఇటీవలి కాలంలో మన దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని పలువురు చెబుతున్నారు. బాధితుల్లో బెంగాల్వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఒడిశాలో ఈ ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమబెంగాల్లోని షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్.. ఒడిశాలో ప్రమాదానికి గురైంది. బాలాసోర్ జిల్లాలోని బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును.. కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టి పట్టాలు తప్పింది. ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్కు చెందిన 13 బోగీలు మరో ట్రాక్పై పడ్డాయి. కాసేపటికే పక్క ట్రాక్పై వెళ్తున్న యశ్వంత్పూర్- హౌరా ఎక్స్ప్రెస్.. అడ్డుగా ఉన్న కోరమాండల్ రైలు బోగీలను ఢీకొట్టింది. దీంతో యశ్వంత్పూర్ ట్రైన్కు చెందిన నాలుగు బోగీలు సైతం పట్టాలు తప్పి బోల్తా కొట్టాయి. ఇలా ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. రెండు రైళ్లలో ఉన్న ప్రయాణికులు ప్రమాద బారిన పడడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది.
బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. శుక్రవారం రాత్రి 7.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.