Rahul, Priyanka tour cancel: కేరళను దేవభూమిగా చాలామంది చెబుతారు. అలాంటి ప్రాంతంలో ప్రకృతి కన్నెర్ర చేస్తే ఫలితాలు ఘోరంగా ఉంటాయి. కేరళలోని వయనాడ్లో అదే జరిగింది. ప్రకృతి పకోపానికి చిన్నస్థాయి పట్టణం కనుమరుగైపోయింది. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 143 మంది మృత్యువాతపడ్డారు. ఆచూకీ తెలియనివారు లెక్క ఇంకా తెలియరాలేదు.
కేరళ వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షాల దాటికి కొండ చరియలు విరిగి పడ్డాయి. దీనికితోడు చలియార్ నదికి వరద పోటెత్తింది. అయితే అర్థరాత్రి, తెల్లవారుజామున రెండుసార్లు మెప్పడి, ముండక్కై, చురాల్మల, అట్టామల, సూల్పుజా గ్రామాలపై కొండచరియలు పడ్డాయి. తెల్లవారే సరికి ఆ గ్రామాలు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి.
నిద్రలోనే చాలామంది కన్నుమూశారు. పలువురి జాడ కనిపించలేదు. ఎక్కడ చూసినా ఎర్రనీరు.. మట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. సహాయచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఘటన జరిగిన 24 గంటలు గడిచినా ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసు కోవచ్చు.
వయనాడ్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ. ఈ ఘటన గురించి తెలియగానే చలించిపోయారు. వెంటనే అక్కడికి వెళ్లాలని భావించారు. కానీ వీలుకాలేదు. రాహుల్, ప్రియాంకగాంధీలు బుధవారం వెళ్లాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కేరళ పార్టీ నాయకులకు చెప్పారు.
కాకపోతే వయనాడ్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఈ టూర్ని వాయిదా వేసుకున్నా రు. సాధ్యమైనంత త్వరగా వయనాడ్లో పర్యటిస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించారు రాహుల్గాంధీ. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, అందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.