Rahul Gandhi is My Choice for PM, Says Kharge: దేశంలో పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్నాయి. నిన్నటితో పార్లమెంటు ఎన్నికల ప్రచారం దేశవ్యాప్తంగా ముగిసిన విషయం తెలిసిందే. రేపు చివరి దశ- ఏదో దశ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. ‘మాకు ఎక్కువ సీట్లు వస్తాయి.. మేమే అధికారంలోకి రాబోతున్నాం’ అంటూ ఇటు బీజేపీ అటు కూటమి ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు అంశాలపై కూడా దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. అదేమంటే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరు ప్రధాని అవుతారు.? ఇటు కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ప్రధాని అవుతారు? అంటూ ప్రజల్లో చర్చ కొనసాగుతుంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని అభ్యర్థిగా తాను రాహుల్ నే సమర్థిస్తానంటూ ఆయన పేర్కొన్నారు. ఓ జాతీయా మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విధంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రాయ్ బరేలీ స్థానం విషయమై కూడా మాట్లాడారు. ఈ స్థానాన్ని ప్రియాంక గాంధీకే కేటాయించాలంటూ తాను ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. అయితే, అక్కడి నుంచి రాహుల్ గాంధీయే పోటీ చేస్తానని ముందుకు రావడంతో ప్రియాంక తప్పుకున్నారంటూ ఆయన తెలిపారు.
Also Read: రేపే తుది దశ పోలింగ్.. ఈసారి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే.. ?
ఖర్గే వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని, కూటమిలో కీలక పాత్రను పోషిస్తున్న కాంగ్రెస్ కే ప్రధానమంత్రి పదవి దక్కే అవకాశముందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.