Rahul in Gujarath Elections : కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు రెండు రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు యాత్రకు విరామం ఇచ్చారు. ఎన్నికల ప్రచారం అనంతరం మళ్లీ రాహుల్ జోడో యాత్ర కొనసాగునుంది.
డిసెంబర్ 1న గుజరాత్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. 5న రెండో దశ పోలింగ్ ఉంటుంది. తొలి ఫేజ్ పోలింగ్కు ఇంకా పది రోజుల టైం మాత్రమే ఉండడంతో ప్రచార రంగంలోకి రాహుల్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నెల 21, 22 రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ.. గుజరాజ్ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారు. సూరత్, రాజ్కోట్ ఏరియాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. తన ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపనున్నారు రాహుల్.
గత 27 ఏండ్లుగా గుజరాత్లో బీజేపీదే అధికారం. దీంతో ఈసారి గుజరాత్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. బీజేపీని ఓడించాలని చూస్తోంది. 2017 గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్కు 77 అసెంబ్లీ సీట్లు వస్తే, బీజేపీకి 99 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 41శాతం ఓటింగ్ షేర్ చేసుకుంటే.. బీజేపీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 49. ఓట్ల శాతంలో రెండు పార్టీల మధ్య పెద్దగా తేడా లేదు. ఈసారి ప్రజల మద్దతును గూడగట్టి విజయం సాధించాలని కాంగ్రెస్ చూస్తోంది.
ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. ప్రజల సమస్యలు వింటూ.. వారిలో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు రాహుల్. యాత్రలో పార్టీలకు అతీతంగా ప్రజలు, ప్రజాసంఘాలు, విద్యావంతులు పాల్గొంటున్నారు. దేశ భవిష్యత్తుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కొన్ని రోజుల్లో రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెల 21, 22న విరామం తర్వాత మళ్లీ రాహుల్ యాత్ర మహారాష్ట్రలో ప్రారంభం అవుతుంది.