Rahul Gandi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోంది. తొలి అడుగు వేసినప్పుడు ఎంతో హుషారుగా ఉన్నారో రాహుల్ అదే జోష్ తో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలను చుట్టేశారు.
మహారాష్ట్రలో హాట్ హాట్ గా
మహారాష్ట్రలో హాట్ హాట్ గా రాహుల్ గాంధీ పాదయాత్ర సాగింది. వీరసావర్కర్ పై రాహుల్ చేసిన విమర్శలతో మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కింది. పాదయాత్రను ముందుకు సాగనివ్వమని మహారాష్ట్ర సీఎం శిండే, బీజేపీ నేతలు చేసిన హెచ్చరికలను లెక్కచేయకుండా రాహుల్ ముందుకుసాగారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. 15 రోజులపాటు మధ్యప్రదేశ్ లో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది.
ప్రియాంక ప్రత్యేక ఆకర్షణ
భారత్ జోడో యాత్రలో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ నెల 24న ప్రియాంక పాదయాత్రలో పాల్గొంటారు. రాహుల్ తో కలిసి నడుస్తారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ ద్వారా తెలిపారు. 4 రోజులపాటు ప్రియాంక భారత్ జోడో యాత్ర కొనసాగిస్తారని ప్రకటించారు. ప్రియాంక గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొననుండటం ఇదే తొలిసారి.
మధ్యప్రదేశ్ లోని బుర్హాన్పూర్ నుంచి భారత్ జోడో యాత్రను రాహుల్ ప్రారంభించారు. నవంబర్ 29న ఇండోర్లో రాహుల్ మీడియా సమావేశం నిర్వహిస్తారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 మధ్య భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఖాండ్వాలోని ఓంకారేశ్వర్, ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాలను రాహుల్ సందర్శిస్తారు. డిసెంబర్ 5న రాజస్థాన్లోకి రాహుల్ గాంధీ అడుగుపెడతారు.
మోదీపై ఫైర్
మధ్యప్రదేశ్ బుర్హాన్ పూర్ లో పాదయాత్ర ప్రారంభించడానికి ముందు మాట్లాడిన రాహుల్.. ప్రధాని మోదీ పాలనపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని పేదలను కొట్టి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. మోదీ విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. చిన్న వ్యాపారులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ఇలాంటి పాలనను తరిమికొట్టాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. కశ్మీర్ లో ఈ యాత్రను ముగించనున్నారు. ఇప్పటివరకు తమిళనాడు,కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో పాదయాత్ర పూర్తి చేశారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ పేదల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండకడుతున్నారు. కాంగ్రెస్ కు మళ్లీ అధికారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.