Rahul Gandhi : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. దారిపొడవునా పేదలతో మమేకవుతూ వారి కష్టాలను తెలుసుకుంటూ రాహుల్ ముందుకుసాగుతున్నారు. ఉత్తరాధిలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా ఆయన స్వెట్టర్ వేసుకోకుండా కేవలం టీషర్టుతోనే యాత్ర కొనసాగిస్తున్నారు. రాహుల్ గాంధీ ధరించిన టీషర్టుపై ఎప్పటి నుంచో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ విషయంపై రాహుల్ మరోసారి స్పందించారు. చలి పెరిగినా పాదయాత్రలో టీషర్టు మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. చిరిగిన దుస్తుల్లో చలితో వణికిపోతున్న ముగ్గురు బాలికలను చూసి ఈ నిర్ణయానికి వచ్చానని వెల్లడించారు.
హర్యానాలోని అంబాలాలో తన టీ షర్టు వార్తలపై రాహుల్ స్పందించారు. తాను టీ షర్టు మాత్రమే ఎందుకు ధరిస్తున్నాను? చలి అన్పించట్లేదా? అని చాలా మంది అడుగుతున్నారని తెలిపారు. కేరళలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా వేడిగా ఉందన్నారు. భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లోకి అడుగుపెట్టాక కాస్త చలిగా అనిపించిందని తెలిపారు. అయితే ఆ రాష్ట్రంలో ఓ రోజు ముగ్గురు పేద బాలికలు చిరిగిన దుస్తుల్లో తన దగ్గరకు వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ పిల్లులు సరైన దుస్తులు లేక చలికి వణికిపోయారని వివరించారు. అప్పుడే తాను టీ షర్టుతోనే పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. చలి తనను గజగజ వణికిస్తే అప్పుడు స్వెట్టర్ గురించి ఆలోచిస్తానని రాహుల్ చెప్పుకొచ్చారు. అప్పటిదాకా కేవలం టీ షర్టుతోనే యాత్ర కొనసాగిస్తానని స్పష్టంచేశారు. రాహుల్ గాంధీ కూడా వణుకుతారని ఆ పిల్లలకు సందేశం ఇవ్వాలనుకుంటున్నానని రాహుల్ వివరించారు.
ఆరెస్సెస్ కార్యకర్తలపైనా రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. వారంతా 21వ శతాబ్దపు కౌరవులని మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర మొదలైన తర్వాత రాహుల్ టీషర్టు ధరపై కొన్నాళ్లు చర్చ జరిగింది. ఆ టీ షర్టు ధరపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. మీడియా తాను ఎలా ఉన్నదానిపై మాత్రమే దృష్టి పెట్టిందని కానీ, తనతోపాటు ఈ యాత్రలో చాలా మంది పేదలు చిరిగిన దుస్తుల్లోనే నడుస్తున్నారని వారిని ఎందుకు గుర్తించట్లేదని రాహుల్ ప్రశ్నించారు. తాను టీషర్టులో ఉండటం ఇక్కడ సమస్య కాదని రైతులు, పేద కూలీలు, వారి పిల్లలు చిరిగిన దుస్తులు ఎందుకు వేసుకోవాల్సి వస్తుందనేదే అసలైన ప్రశ్న అని రాహుల్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.