Rahul Gandhi yatra : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోయే రెండో యాత్రకు పేరును స్వల్పంగా మార్చారు. ‘జోడో’ పదాన్ని కూడా జత చేస్తున్నట్లు పార్టీ నేతలు గురువారం వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జ్లు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ భేటీలోనే యాత్ర పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు జైరాం రమేశ్ వెల్లడించారు
Rahul Gandhi yatra : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోయే రెండో యాత్ర పేరును స్వల్పంగా మార్చారు. ‘జోడో’ పదాన్ని కూడా జత చేస్తున్నట్లు పార్టీ నేతలు గురువారం వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జ్లు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు పాల్గొన్నారు. రాహుల్ చేపట్టే యాత్ర పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నామని సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో మహాయాత్రకు కాంగ్రెస్ సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. భారత్ జోడో యాత్ర తరహాలో కొత్తగా మరో యాత్ర రాహుల్ గాంధీ చేపట్టనున్నారు. దీనికి తొలుత ‘భారత్ న్యాయ్ యాత్ర’ అని నామకరణం చేశారు. తాజాగా ఈ యాత్రకు స్వల్ప మార్పు చేశారు. పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టే ఈ యాత్రకు ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర అని నామకరణం చేసినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఇండియా కూటమి నేతలందరినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర జనవరి 14న ప్రారంభై మార్చి 30న ముగుస్తుందని జైరాం రమేష్ వెల్లడించారు. ఈ యాత్ర 66 రోజులపాటు సాగనుందన్నారు. 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనున్నట్లు వెల్లడించారు. దాదాపు 100 లోక్సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల వారితో రాహుల్ గాంధీ మాట్లాడతారని జైరాం రమేశ్ వివరించారు.
జోడో న్యాయ్ యాత్ర ముందుగా మణిపూర్ రాజధాని ఇంఫాల్ల ప్రారంభమవుతుందని జైరాం రమేష్ వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలలో సాగనున్నట్లు వెల్లడించారు.
తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుందని జైరాం రమేష్ తెలిపారు. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని తెలిపారు. గతంలో రాహుల్ గాంధీ.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 136 రోజులపాటు 12 రాష్ట్రాల్లో దాదాపు 4,500 కిలోమీటర్ల మేర జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.