Rahul Gandhi : వచ్చే సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయనే అంచనాలున్నాయి. 26 విపక్షాలు పార్టీ కలిసి కూటమిగా ఏర్పడటంతో ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ లీడర్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఇండియా కూటమి తరఫున బరిలోకి దిగుతారని ప్రకటించారు. ఈ విషయంపై ఇండియా కూటమిలో చర్చ జరిగిందని వివరించారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ను అన్ని పార్టీలు సమ్మతించాయని వెల్లడించారు.
విపక్ష కూటమి ఏర్పాటుపైనా అశోక్ గహ్లోట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ స్థానిక అంశాలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక పరిస్థితులు అన్ని పార్టీలపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయని వివరించారు. అందువల్లే ఇండియా కూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత అహంకారపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ 31 శాతం ఓట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అశోక్ గహ్లోట్ వివరించారు. మిగిలిన 69 శాతం ప్రజలు మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. మోదీ 50 శాతం ఓట్లతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాశాన్ని వ్యక్తం చేశారని అది ఎప్పటికీ జరగదని గహ్లోట్ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రధాని ఎన్నో హామీలచ్చారని కానీ ఎన్ని అమలు చేశారో ప్రజలకు తెలుసున్నారు.
ఇస్రో విజయాలకు గత ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ , ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలే కారణమని గెహ్లోట్ స్పష్టం చేశారు భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ సూచనతో నెహ్రూ భారత అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ హయాంలోనే ఇస్రోగా నామకరణం చేశారని తెలిపారు . నెహ్రూ, ఇందిరాల కృషి ఫలితంగానే ప్రస్తుతం చంద్రయాన్- 3 లాంటి విజయాలు సాధ్యమయ్యాయని ప్రశంసించారు.