Rahul Gandhi visits assam to meet victims: కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. సోమవారం ఉదయం అక్కడికి చేరుకున్న ఆయన.. కచార్ జిల్లాలోని సిల్చార్ను సందర్శించారు. ఎయిర్పోర్టులో అస్సాం, మణిపూర్ కాంగ్రెస్ నేతలను ఆయన కలిశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను రాహుల్ గాంధీ సందర్శించారు. ఈ సందర్భంగా వరద బాధితులతో మాట్లాడారు.
అనంతరం మణిపూర్కు ఆయన ప్రయాణమయ్యారు. అక్కడ జిబామ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. ఆ తరువాత మోయిరాంగ్, చురాచాంద్పుర్లో శిబిరాలను సందర్శించి బాధితులను ఆయన పరామర్శించనున్నారు. సాయంత్రం ఆయన రాజ్భవన్లో గవర్నర్ను కలవనున్నారు. ఆ తరువాత విలేకర్ల సమావేశం నిర్వహించనున్నారు.
అయితే, అస్సాంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరదలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు భారీగా విరిగిపడుతున్నాయి. వరదల్లో చిక్కి 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా కామ్రూప్, నాగౌన్, ధుబ్రి, కచార్, మెరిగావ్, హైలాకండి, దక్షిణ సల్మార, దిబ్రూగఢ్ సహా పలు జిల్లాలు వరదల దెబ్బకు అతలాకుతలమయ్యాయి. బరాక్, బ్రహ్మపుత్రలతో కలిపి మొత్తం ఆరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ కామ్రూప్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించిన విషయం తెలిసిందే.
Also Read: నీట్ పేపర్ లీకైన మాట వాస్తవమే: సుప్రీంకోర్టు
రాష్ట్రంలోని వేలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరదల కారణంగా 63,490 హెక్టార్ల సాగు భూమి నీట మునిగింది. అత్యధికంగా ధుబ్రి జిల్లాలో 7 లక్ష మందికి పైగా ప్రభావితమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ తరువాత దర్రాంగ్లో 1,86,108.. బార్పేటలో 1,39,399.. మెరిగావ్లో 1,46,045 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 4,103 మంది వరద బాధితులు 612 సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. కాగా, ఈ ఏడాది రాష్ట్రంలో ఆరుసార్లు వరదలు సంభవించాయి.