Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రతపై వివాదం మరింత ముదిరింది. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఊహించని విధంగా సీఆర్ పీఎఫ్ నుంచి సమాధానం వచ్చింది. ఢిల్లీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ భద్రత విషయంలో అనేక వైఫల్యాలు కనిపించాయని కాంగ్రెస్ ఆరోపించింది. జడ్ ప్లస్ స్థాయి భద్రత కల్పించాల్సిన వ్యక్తికి ఢిల్లీ పోలీసులు కనీస రక్షణను ఇవ్వలేకపోయారని విమర్శించింది. అయితే కాంగ్రెస్ ఆరోపణలపై CRPF స్పందించింది. ఢిల్లీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా భద్రతా మార్గదర్శకాలను పూర్తిగా పాటించామని స్పష్టం చేసింది. కానీ రాహుల్ గాంధీ పదేపదే నిబంధనలు ఉల్లంఘించారని CRPF వివరించింది. రాహుల్ గాంధీ.. 2020 నుంచి 113 సార్లు సెక్యూరిటీ ప్రొటోకాల్ను ఉల్లంఘించినట్లు తెలిపింది.
ఢిల్లీలో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చుట్టూ జనాలను నియంత్రించడంలో, భద్రతా వలయాన్ని నిర్వహించడంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ ఆరోపించింది. పంజాబ్, జమ్మూ- కశ్మీర్ లాంటి సున్నిత ప్రాంతాల మీదుగా యాత్ర సాగనున్న నేపథ్యంలో రాహుల్కు భద్రతను పెంచాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసులు, ఇతర ఏజెన్సీల సమన్వయంతో సీఆర్పీఎఫ్ ఈ యాత్రకు భద్రతా ఏర్పాట్లు చేసింది.
డిసెంబర్ 24న ఢిల్లీలో రాహుల్ యాత్ర సందర్భంగా రెండు రోజుల ముందే అదనపు భద్రతపై సమన్వయ సమావేశం నిర్వహించామని CRPF వెల్లడించింది. తగినంత సిబ్బందిని మోహరించిన విషయాన్ని ఢిల్లీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. భద్రత పొందుతున్న వ్యక్తులు వారి రక్షణ కోసం రూపొందించిన మార్గదర్శకాలకు పాటిస్తేనే. ఫలితం ఉంటుందని పేర్కొంది. కానీ రాహుల్ అనేక సందర్భాల్లో భద్రతా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించింది. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లామని అని సీఆర్పీఎఫ్ వెల్లడించింది. మరి CRPF రిఫ్లైపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.