Rahul Gandhi| ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ రోజు మణిపూర్ లో పర్యటించనున్నారు. గత ఏడాది మేలో జాతి హింస చెలరేగిన తరువాత ఇప్పటికే రాహుల్ రెండు సార్లు మణిపూర్ వెళ్లారు. ఈ రోజు ఆయన ఢిల్లీ నుంచి సిల్చార్ వరకు విమానంలో బయలు దేరి.. అక్కడి నుంచి జిరిబామ్ జిల్లాకు వెళతారని మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేఘచంద్ర తెలిపారు. ఇటీవల జూన్ 6న జిరిబామ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగాయి.
రాహుల్ గాంధీ డే ప్లాన్
”జిరిబామ్ జిల్లాలోని కొన్ని సహాయ శిబిరాలను రాహుల్ గాంధీ సందర్శిస్తారు. ఆ తర్వాత సిల్చార్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి విమానంలో ఇంఫాల్కు చేరుకుంటారు. ఇంఫాల్లో దిగిన తర్వాత చురచంద్పూర్ జిల్లాకు వెళ్లి అక్కడ సహాయక శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలను సంబోధిస్తారు. ఆ తరువాత మణిపూర్ గవర్నర్ తో సమావేశమవుతారు” అని మేఘచంద్ర వివరించారు. మణిపూర్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులతో కూడా భేటీ కానున్నారు.
హింసాత్మక ఘటనలు జరిగిన తరువాత.. రాహుల్ జూన్ 2023లో, ఈ సంవత్సరం ప్రారంభంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా మణిపూర్ కు వెళ్లారు.
Also Read: Hathras stampede: ఆ కుట్ర వల్లే హత్రాస్ తొక్కిసలాట.. భోలే బాబా లాయర్ సంచలన కామెంట్స్ !
పార్లమెంటులో మణిపూర్ హింసపై ప్రభుత్వంపై రాహుల్ ఫైర్
దేశంలో లోక్ సభ ఎన్నికల తరువాత ఇటీవలే 18వ లోక్సభ తొలి సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన మణిపూర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మణిపూర్ లో అధికారంలో ఉన్న బిజేపీ ప్రభుత్వమే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని.. బిజేపీ విధానాలు, రాజకీయాల వల్లే మణిపూర్ లో అంతర్యుద్ధం పరిస్థితి ఉందని మండిపడ్డారు.
“మీరు మణిపూర్ను అంతర్యుద్ధంలో ముంచారు. మీరు, మీ విధానాలు మరియు మీ రాజకీయాల వల్ల మణిపూర్ తగలబడిపోయింది” అని ఆయన బిజేపీని ఉద్దేశించి అన్నారు.
మణిపూర్ లో హింస కారణంగా ప్రజలు చనిపోతున్నా.. ప్రధాన మంత్రి మోదీ రాష్ట్రాన్ని సందర్శించడం లేదని విమర్శించారు. “మణిపూర్ రాష్ట్రం మన దేశంలో భాగం కానట్టుగా ప్రధాన మంత్రి ప్రవర్తిస్తున్నారు. మణిపూర్ లో ఒకసారి ప్రధాన మంత్రి పర్యటించాలని, అక్కడ ప్రజల పరిస్థిని చూడాలని మేము ఎన్నోసార్లు ఆయనను కోరాము. కానీ ఆయన దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు,” అని రాహుల్ తీవ్రస్థాయిలో ప్రధానమంత్రిపై విమర్శలు చేశారు.
Also Read: Mahua Moitra: ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు చేసిన పోలీసులు
మణిపూర్ హింసపై రాజ్యసభలో ప్రధాని మోదీ ఏమన్నారంటే..
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ, మణిపూర్ లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కలిసి పనిచేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మణిపూర్లో జరిగిన అల్లర్ల కేసులలో ఇప్పటివరకు 500 మందికి పైగా అరెస్టు చేశామని, 11,000 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని ఆయన తెలిపారు.
మణిపూర్లో గత ఏడాది మేలో మెయిటీ, కుకీ వర్గాల మధ్య హింస చెలరేగింది. అప్పటి నుంచి, దాదాపు 200 మంది మరణించారు, వేలాది మంది ఇళ్లు, ప్రభుత్వ భవనాలను అల్లరిమూకలు కాల్చివేయడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదాలు జరిగాయి. వేల మంది ఇళ్లు కోల్పోయి సహాయక శిబిరాల్లో శరణార్థులుగా మారారు.