Rahul Gandhi : భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. వరసగా నాలుగో రోజు సభలో గందరగోళం ఏర్పడింది. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో సభలో అలజడి రేగింది. విదేశాల్లో మన దేశాన్ని తక్కువ చేసేలా రాహుల్ వ్యాఖ్యలు చేయడం సరికాదని కాషాయ సభ్యులు విరుచుకుపడ్డారు. విదేశీ పర్యటన తర్వాత భారత్కు చేరుకున్న రాహుల్.. గురువారం పార్లమెంట్కు వచ్చి ఈ వివాదంపై స్పందిస్తారని తొలుత వార్తలు వచ్చాయి.
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాహుల్పై విమర్శలు చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా స్వదేశంలో ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తి.. విదేశాలకు వెళ్లి తనకు మాట్లాడే స్వేచ్ఛ లేదని ఎలా చెబుతారని నిలదీశారు. కాంగ్రెస్ను రాహుల్ గాంధీనే ముంచేస్తున్నారని.. కానీ దేశానికి హాని చేయాలని ప్రయత్నిస్తే తాము నిశ్శబ్దంగా ఉండబోమని కిరణ్ రిజిజు విరుచుకుపడ్డారు. రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే రాహుల్ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఇదివరకే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. అదానీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే సభా కార్యకలాపాలు జరగకుండా అధికార పక్షం వ్యవహరిస్తోందని కాంగ్రెస్, విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.
కేంబ్రిడ్జ్ ప్రసంగం ఇష్యూపై రాహుల్ గాంధీ స్పందించారు. తానెలాంటి దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తనను అనుమతిస్తే సభలో మాట్లాడతానని తేల్చిచెప్పారు. అవకాశం ఇవ్వకపోతే పార్లమెంట్ బయట మాట్లాడతానన్నారు.