Rajiv Gandhi : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దేశ వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు.ఆయన 32వ వర్థంతి సందర్భంగా ఆయన కుమారుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి రాజీవ్ గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు.
రాహల్ గాంధీ భావోద్వేగంతో ట్వీట్ పోస్టు చేశారు. ‘‘నాన్నా.. ఒక ప్రేరణ రూపంలో, జ్ఞాపకాలుగా మీరు సదా నాతోనే ఉన్నారు’’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే రాజీవ్ జ్ఞాపకాలను గుర్తు చేసే ఓ వీడియోను జత చేశారు.
1944 ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జన్మించారు. తల్లి ఇందిరాగాంధీ హత్య తర్వాత 1984లో పార్టీ బాధ్యతలు చేపట్టారు. 40 ఏళ్ల వయసులోనే 1984 అక్టోబర్లో ప్రధాని పదవి చేపట్టి రికార్డు సృష్టించారు. 1989 అక్టోబర్ 2న వరకు ఆయన ప్రధానిగా కొనసాగారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ లో ఉగ్రసంస్థ ఎల్టీటీ జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ కన్నుమూశారు.