Rahul Gandhi: పాలి పగలు మామూలుగా ఉండవు. గాంధీ కుటుంబమూ ఇందుకు అతీతం కాదు. రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీకి పడేది కాదంటారు. ఏళ్లుగా సోనియా, రాహుల్ గాంధీలతో మేనకా, వరుణ్ గాంధీలకు సత్సంబంధాలు లేవు. దివంగత సంజయ్ గాంధీ కుటుంబం బీజేపీలో కొనసాగుతోంది. రాజీవ్ కుటుంబం కాంగ్రెస్ ని హస్తగతం చేసుకుంది. అలా కుటుంబ ధ్వేషాలు, పార్టీ విధ్వేషాలు ఆ రెండు ఫ్యామిలీల మధ్య మరింత దూరం పెంచేశాయి.
ఇటీవల బీజేపీ నేత వరుణ్ గాంధీ రెబెల్ కామెంట్స్ చేస్తున్నారు. పార్టీని తరుచూ విమర్శిస్తున్నారు. బీజేపీలో తనకు, తన తల్లికి ప్రాధాన్యం దక్కడం లేదనే అక్కసో.. మరే కారణమో తెలీదు కానీ, కేంద్ర విధానాలను తప్పుబడుతూ పలుమార్లు కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్ చేశారు. కమలనాథులు వరుణ్ గాంధీని పట్టించుకోవడం మానేశారు. పార్టీ సమావేశాలకూ పిలవడం లేదు. త్వరలోనే వరుణ్ గాంధీ బీజేపీని వీడుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి, కాంగ్రెస్ లో చేరుతారా?
ఇదే విషయం రాహుల్ గాంధీని ప్రశ్నిస్తే.. కీలక వ్యాఖ్యలు చేశారు. వరుణ్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటారా? అని విలేకరులు రాహుల్ ని అడిగారు. ఓ బ్రదర్ గా వరుణ్ ని కలిసి ఆలింగనం చేసుకుంటా కానీ.. అతని సిద్ధాంతాన్ని మాత్రం ఎన్నడూ సమర్థించనని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.
“వరుణ్ గాంధీ బీజేపీలో ఉన్నారు. ఇక్కడకు (భారత్ జోడో యాత్రకు) వస్తే ఆయనకు సమస్యే. అతని సిద్ధాంతంతో నేను ఏకీభవించను. నేను తలైనా నరుక్కుంటా కానీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లను. మా కుటుంబానికో సిద్ధాంతం ఉంది. కానీ, వరుణ్ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అలవరచుకున్నాడు. ఆరెస్సెస్ మంచి పని చేస్తోందని చాలా ఏళ్ల క్రితమే నాకు చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, మన కుటుంబం దేని గురించి నిలబడిందో తెలుసుకుంటే దాన్ని నువ్వు అంగీకరించవని వరుణ్తో ఆనాడే చెప్పాను” అని రాహుల్ గాంధీ అన్నారు.
దేశంలోని అన్ని వ్యవస్థలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు బీజేపీ, ఆరెస్సెస్లు ప్రయత్నిస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. మీడియా, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలపైనా ఒత్తిడి ఉందన్నారు.