Rahul Gandhi : భారత్ జోడో యాత్ర ముగింపు సభ జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో నిర్వహించారు. మంచు కురస్తున్నా సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సభలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మంచులో తడుస్తూనే రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన పాదయాత్ర లక్ష్యాలను, సాధించిన విజయాలను వివరించారు. భారత్ జోడో యాత్ర ఊహించిన దాని కంటే విజయవంతమైందని పేర్కొన్నారు.
పేదలే స్ఫూర్తి..
భారత్ జోడో యాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకున్నాని రాహుల్ తెలిపారు. ఈ యాత్ర ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పుకొచ్చారు. దేశ యావత్ శక్తి మనతోనే ఉందన్నారు. అందరి మద్దతుతోనే పాదయాత్ర పూర్తి చేయగలిగానని స్పష్టం చేశారు. అన్ని వర్గాల బాధలు విన్నానని తెలిపారు. ప్రజల సహకారం చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని భావోద్వేగంతో చెప్పారు. ప్రజల సహకారం లేనిదే ఏ పని ముందుకు సాగదని.. ఒకదశలో యాత్ర పూర్తి చేయగలనా అనుకున్నానన్నారు. దేశంలో సరైన బట్టలులేని చాలా మంది నిరుపేదలను చూశానని అందుకే టీషర్ట్ తోనే పాదయాత్ర పూర్తి చేశానని రాహుల్ గాంధీ వివరించారు.
కాశ్మీర్ కు రాష్ట్ర హోదా..
భారత్ జోడో యాత్ర ముగింపు సభలో జమ్మూకాశ్మీర్ ప్రజలకు రాహుల్ గాంధీ భరోసా కల్పించారు. కాశ్మీర్ ప్రజలకు దేశం అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.
సోదరితో సరదాగా
భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మంచులో ఒకరినొకరు సరదాగా ఆటపట్టించుకున్నారు. ఒకరిపై ఒకరు స్నో బాల్స్ విసురుకున్నారు. మరికొందరిపైనా రాహుల్ స్నో బాల్స్ విసిరారు. శ్రీనగర్లోని చోటుచేసుకున్న ఈ ఘటనను రాహుల్ ట్వీట్ చేయడంతో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
పాదయాత్ర సాగిందిలా..
2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ వరకు సాగింది. మొత్తం 134 రోజులపాటు 4,084 కిలోమీటర్లు రాహుల్ నడిచారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, జమ్మూకశ్మీర్ ల్లో యాత్ర సాగింది.