Supreme court on Rahul Gandhi news(Today’s breaking news in India) : పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సూరత్ కోర్టు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మోదీ ఇంటి పేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి మార్చి 23న సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత రోజే లోక్ సభ సచివాలయం రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది.
అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు రాహుల్ గాంధీ. సూరత్ జిల్లా కోర్టు తీర్పుపై సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఆ తర్వాత గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా సూరత్ కోర్టు తీర్పునే సమర్థించింది. తాజాగా సుప్రీంకోర్టులో రాహుల్ పిటిషన్ వేశారు. ఆయన తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు మోదీ కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఆయన ఆ ఇంటి పేరును తర్వాత పెట్టుకున్నారని తెలిపారు. రాహుల్ నేరస్థుడు కాదన్నారు. బీజేపీ కార్యకర్తలు గతంలో అనేక కేసులు వేశారని తెలిపారు. ఏ కేసులోనూ శిక్ష పడలేదని సింఘ్వీ వాదనలు వినిపించారు. పార్లమెంట్ హాజరయ్యేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు, రాహుల్ నిర్దోషిగా విడుదలయ్యేందుకు ఇదే చివరి అవకాశమని సుప్రీంకోర్టులో సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల తర్వాత సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
2019 ఎన్నికల సమయంలో కర్ణాటకలో రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. సూరత్ కోర్టు తీర్పు తర్వాత రాహుల్ లోక్ సభ సభ్యత్వం కోల్పోయారు. ఇప్పుడు జరగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయపోరాటం చేస్తున్నారు. సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు రాహుల్ కు మార్గ సుగమైంది. ఆ సెషన్ సమావేశాలకు హాజరవుతారని రాహుల్ తరఫున న్యాయవాదులు తెలిపారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేను వెంటనే అమలు చేయాలని రాహుల్ తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వీ తెలిపారు. స్టే వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. రాహుల్ పై విధించిన అనర్హతను లోక్ సభ సచివాలయం తొలగించాలన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుతో రాహుల్ గాంధీ మళ్లీ ఎంపీగా కొనసాగే అవకాశం ఉంది. ఐతే ఇప్పటికిప్పుడు ఆయన ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. లోక్ సభ సెక్రెటరీకి ఆయన వెంటనే లేఖ రాయాల్సి ఉంటుంది. సుప్రీం తీర్పు కాపీని ఆ లేఖకు జత చేయాల్సి ఉంది. అంతే కాదు అదే తీర్పు కాపీని ఎన్నికల కమిషన్ కు సైతం పంపాల్సి ఉంటుంది. ఐతే ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఎంపీ స్థానాన్ని ఖాళీ ఉన్నట్లుగా ఈసీ నోటిఫై చేయలేదు. దీంతో మున్ముందు నోటిఫై చేయకుండా ఉండేందుకు ఆయన తీర్పు కాపీతో ఓ లేఖను రాయాల్సి ఉంటుంది. ఫలితంగా ఆయన సభ్యత్వాన్ని ఈసీ కూడా పునరుద్ధరించే అవకాశం ఉంది.