Rahul Gandhi criticised Modi in Gujarath
బీజేపీని, మోదీని చిత్తుగా ఓడిస్తాం..ఇది రాసిపెట్టుకోవాలి. ఎందుకంటే నూతన ఆరంభం
ఇక్కడినుంచే మొదలవుతుందని రాహుల్ గాంధీ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. రాజ్ కోట్
గేమింగ్ జోన్ అగ్నిప్రమాద బాధితులను పరామర్శించేందుకు గుజరాత్ కు వచ్చారు. ఆ తర్వాత అహ్మదాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘గతంలో బీజేపీ నేతలు గుజరాత్ లో మన కార్యకర్తలు, నేతలను బెదిరించారు. ఏకంగా మన పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు మనకు సమయం వచ్చింది. రాబోయే ఎన్నికలలో ఇక్కడి బీజేపీ ప్రభుత్వాన్నే ధ్వంసం చేయబోతున్నాం. మోదీ విజన్ అనేది ఓ గాలి బుడగ. యూపీలో ఇప్పటికే బద్దలయింది. వారణాసి స్థానం నుంచి మోదీ గతంలో కన్నా తక్కువ మెజారిటీతోనే గెలిచారు. మన నుంచి కూడా అక్కడ కొన్ని పొరపాట్లు జరిగాయి. లేకుంటే మోదీ ఖచ్చితంగా ఓడిపోయేవారు’ అన్నారు.
కాంగ్రెస్ ఉనికి గుజరాత్ నుంచే..
కాంగ్రెస్ పార్టీ ఉనికి, సిద్ధాంతం గుజరాత్ లోనే పురుడుపోసుకున్నాయని అన్నారు. బ్రిటీష్ వారు మన దేశాన్ని పీడిస్తున్నప్పుడు వెలుగు బాటలు చూపిన దార్శనికుడు మహాత్మాగాంధీయే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. అదే బీజేపీలో ప్రతి ఒక్కరూ మోదీకి భయపడుతుంటారు. కాంగ్రెస్ లో అలాంటి భయాలు ఏమీ లేవు అన్నారు.ముందుగా మోదీ అయోధ్య నుంచే పోటీచేయాలని అనుకున్నారు. అయితే అయోధ్యలో మోదీ గెలిచే అవకాశం లేదని సొంత పార్టీ వారే చెప్పడంతో తమ ఆలోచన మార్చుకున్నారు మోదీ చివరకు వారణాసి నుంచి పోటీచేసి తక్కువ మెజారిటీతోనే గెలిచారు. తనకి తాను దైవాంశసంభూతుడిగా చెప్పుకునే మోదీకి సామాన్యుల కష్టాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.అయోధ్యలో రామాలయం పేరిట పేదల భూములను ఆక్రమించుకున్నారని..కనీసం ఆ భూములకు పరిహారం కూడా ఇవ్వలేదని రాహుల్ మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు హస్తం. ఇది ప్రతి మతంలోనూ ప్రముఖంగా కనిపిస్తుందని అన్నారు.