Rahul Gandhi Leads On Both Wayanad & Raebareli Seats: దేశంలో సార్వత్రిక ఎన్నికల సరళిని చూస్తుంటే బీజేపీకి అనుకున్న స్థాయిలో మెజారిటీ రాదని స్పష్టమవుతోంది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను పోటీచేసిన రెండు స్థానాలలోనూ అన్ని రౌండ్లలోనూ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నారు. రాహుల్ పోటీ చేస్తున్న వయనాడ్ (కేరళ), రాయ్ బరేలీ (యూపీ) లోక్ సభ స్థానాలలో రాహుల్ గాంధీ దూసుకుపోతున్నారు. అధికార పక్షం నేతలు రాహుల్ గాంధీని రాజకీయ పరిణితి లేని నేతగా జమకట్టి పప్పు అంటూ గేలిచేసినా ఇప్పటివరకూ ప్రజల పక్షాన తన గళం వినిపిస్తూ ఎంతో సంయమనం పాటిస్తూ వస్తున్నారు రాహుల్ గాంధీ. పైగా దేశవ్యాప్తంగా రాహుల్ చేపట్టిన జోడో యాత్ర సత్పలితాలను ఇస్తోంది.
ఈ ఎన్నికలలో తనకు ఎదురే లేదని ఊహించిన ఎన్టీఏ కూడమికి ఇండియా కూటమి అనూహ్య రీతిలో బలం పుంజుకుంది. ప్రధాని మోదీ ప్రతి ఎన్నికల సభలలో చేసిన ప్రసంగాల కన్నా రాహుల్ ప్రసంగాలనే ఎక్కువగా ప్రజలు గమనిస్తున్నారని తెలుస్తోంది. పైగా మోదీ మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలను జనం తిప్పికొడుతున్నారు. గత రెండు ఎన్నికలలో మోదీ గెలవడానికి కారణమైన సంక్షేమ పథకాల కన్నా ఎక్కువగా మోదీ ముస్లిం వ్యతిరేక వార్తలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.
అదే సమయంలో రాహుల్ గాంధీ మోదీకి తగిన కౌంటర్ ఇస్తూ తన ప్రసంగాలను కొనసాగించారు. అందుకే ముస్లిం ఓటర్ల మనసులు కూడా రాహుల్ గాంధీ గెలుచుకున్నారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావించిన వారణాసి నియోజకవర్గంలో స్వయంగా ప్రధానే కొన్ని రౌండ్లలో వెనకబడటం చూస్తుంటే స్పష్టంగా ఇండియా కూటమి ప్రభావం కనిపిస్తోంది. వయనాడ్, రాయ్ బరేలీలో 50 వేలనుంచి లక్ష మెజారిటీతో రాహుల్ గాంధీ గెలుపొందే అవకాశాలు ఈ ఎన్నికలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also Read: యూపీలో షాకింగ్ ఫలితాలు.. బీజేపీ మ్యాజిక్ పని చేయలేదా?
మనసులు గెలుచుకున్న రాహుల్
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలి, రెండో విడత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆశించిన మేర సీట్లు రావని తేలి పోయింది. ఇక దక్షిణాదిన సత్తా చాటాలని ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో రాహుల్ చేపట్టిన యాత్రకు ఊహించని రీతిలో ఆదరణ అన్ని వర్గాల నుంచి లభించింది. రాహుల్ గాంధీకి రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుండడంతో బీజేపీ ఆందోళనకు గురవుతోంది.
యూట్యూబ్ లో వీక్షకుల పరంగా చూస్తే రికార్డు బద్దలు కొట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 40 శాతం వీక్షించగా , యూపీ కాంగ్రెస్ కు సంబంధించి 14 శాతం, ఆప్ ను 13 శాతం, రాహుల్ గాంధీని 11 శాతంగా ఉంటే మోదీని కేవలం 9 శాతం మాత్రమే వీక్షించడం విశేషం. ఈ సారి జరిగిన ఎన్నికలలో రాహుల్ ఎంతో హుందాగా ప్రసంగించిన తీరు, జోడో యాత్రతో పెరిగిన ఆత్మవిశ్వాసం వెరసి రాబోయే కాలంలో కాబోయే ప్రధాని రాహుల్ అనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.