Rahul Gandhi : భారత్ జోడో యాత్రతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చుట్టేసిన రాహుల్ గాంధీ.. రెండో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ భారత్ న్యాయయాత్ర పేరుతో ఈ యాత్ర చేపట్టనున్నారు. భారత్ జోడోయాత్రకు కొనసాగింపుగా జరిగే ఈ యాత్రను మణిపూర్ లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ యాత్రను ముంబైలో ముగిస్తారు.
జనవరి 14 నుంచి మార్చి 20 వరకు భారత్ న్యాయయాత్ర సాగనుంది. కొన్ని ప్రాంతాల్లో రాహుల్ బస్సు ద్వారా యాత్ర చేస్తారు. మరికొన్న చోట్ల కాలినడకన యాత్ర జరగనుంది. 14 రాష్ట్రాలు 85 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. మణిపూర్ నుంచి మొదలయ్యే రాహుల్ గాంధీ యాత్ర.. నాగాలాండ్, అస్సోమ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా సాగుతోంది. చివరికి మహారాష్ట్రకు చేరుకుంటుంది.
మణిపూర్ నుంచి ముంబై వరకు మొత్తం 6,200 కిలోమీటర్ల ఈ యాత్ర సాగనుంది. భారత దేశంలో తూర్పు ప్రాంతం నుంచి పశ్చిమ ప్రాంతం వరకు యాత్ర చేపట్టాలని సీడబ్ల్యూసీ ప్రతిపాదించింది. దీంతో రాహుల్ గాంధీ యాత్ర చేసేందుకు సన్నద్ధమయ్యారు.
గతేడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర చేపట్టారు. తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర.. 5 నెలలపాటు సాగింది. మొత్తం 4,500 కిలోమీటర్లు సాగింది. మొత్తం 136 రోజులపాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక , ఆంధప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, యూపీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మీదుగా కశ్మీర్ చేరుకున్నారు. 2023 జనవరి 30న లాల్చౌక్లో భారత్ జోడో యాత్రను ముగించారు. అక్కడ జాతీయ జెండా ఎగురవేశారు.
రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన సమయంలో వివిధ రంగాల ప్రముఖులతో ఆయనతో కలిసి కొందదూరం నడిచారు. అప్పుడు దక్షిణ భారత్ నుంచి ఉత్తరాది వరకు యాత్ర చేపట్టిన రాహుల్. ఈ సారి తూర్పు నుంచి పశ్చిమ వరకు బస్సు యాత్రలో పాల్గొననున్నారు.