Radika Sarathkumar Filed her Nomination as a BJP MP Candidate: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశలో పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తమిళనాడులో తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. దీంతో నామినేషన్ల సందడి మొదలైంది.
ప్రముఖ సినీ నటి రాధికా శరత్ కుమార్ బీజేపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె విరుదునగర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రాధికా సమర్పించిన ఎన్నికల ఆఫిడవిట్ లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యారు. ఆమె తన ఆస్తుల విలువ 53 కోట్ల 45 లక్షల రూపాయులుగా పేర్కొన్నారు.
రాధికా శరత్ కుమార్ రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. తన వద్ద రూ.33 లక్షల నగదు ఉందని ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు. 75 తులాల బంగారం, 5 కిలోల వెడి ఆభరణాలు ఉన్నాయని ప్రకటించారు. 27 కోట్ల రూపాయల చరాస్తులు, 26 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. దాదాపు 14 కోట్ల 79 లక్షల అప్పు ఉందని వివరాలు తెలిపారు.
Also Read: తీహార్ జైలుకు కవిత.. ఏప్రిల్ 9 వరకూ జ్యుడిషియల్ రిమాండ్
రాధిక భర్త సినీ నటుడు శరత్ కుమార్ గతంలో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పేరుతో పార్టీని స్థాపించారు. ఇటీవల ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఈ నేపథ్యంలోనే రాధికాకు విరుదునగర్ లోక్ సభ సీటును కాషాయ పార్టీ ఇచ్చింది.
విరుదునగర్ లోక్ సభ స్థానంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఇక్కడ నుంచే దివంగత సినీ నటుడు కెప్టెన్ విజయ్ కాంత్ కుమారుడు విజయ్ ప్రబాకరణ్ పోటీ చేస్తున్నారు. విజయ కాంత్ పార్టీ డీఎండీకేకు అన్నాడీఎంకేతో పొత్తు ఉంది. ఇప్పటికే విజయ్ ప్రభాకరన్ నామినేషన్ కూడా వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులను 17 కోట్ల 95 లక్షల రూపాయలుగా పేర్కొన్నారు. 11 కోట్లు 38 లక్షల చరాస్తులు, 6 కోట్ల 57 లక్షల స్థిరాస్తులు ఉన్నాయని ప్రకటించారు. అప్పులను కోటీ 28 లక్షల రూపాయలుగా చూపించారు.
ఇప్పుడు విరుదునగర్ లో విజయం ఎవరిదనే అంశంగా హాట్ టాపిక్ గా మారింది. రెండు సినీ కుటుంబాల మధ్య పొలిటికల్ వార్ లో ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది.