Punjab Governor : పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ భన్వరీలాల్ పురోహిత్ తన పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రాజీనామా లేఖను సమర్పించారు. భన్వరీలాల్ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ మరుసటి రోజే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
గత కొంతకాలంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో గవర్నర్ భన్వరీలాల్ విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ సీఎంకు గవర్నర్ పలుమార్లు లేఖలు రాశారు. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గవర్నర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానంటూ గతేడాది ఆగస్టులో హెచ్చరించారు.
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను పెండింగ్లో పెడుతున్నారంటూ అటు భగవంత్ మాన్ సర్కారు కూడా ఆరోపించింది. ఈ వ్యవహారం చివరకు సుప్రీంకోర్టును చేరింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం, గవర్నర్ మధ్య ప్రతిష్టంభన ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. బిల్లులకు ఆమోదం తెలపకపోవడంపై పంజాబ్ గవర్నర్ను ఉద్దేశిస్తూ.. నిప్పుతో ఆడుతున్నారు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో భన్వరీలాల్ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉండగా.. ఇటీవల చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ ఎన్నికల్లో కమలం పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆమ్ ఆద్మీ ఆరోపించింది. ఆప్ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది.