Pune Porsche Car Accident : పూణె పోర్షే కారు ప్రమాదం దేశమంతా సంచలనం రేపింది. ఈ ప్రమాదంలో తాజాగా తెరపైకి మరొక ట్విస్ట్ వచ్చింది. ప్రమాదానికి కారణమైన మైనర్ తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పూణె పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. కారు ప్రమాదం తర్వాత.. కేసు తన కొడుకుపైకి రాకుండా వైద్యుల రిపోర్టులో బ్లడ్ శాంపిల్స్ ను మార్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మార్చిన రక్త నమూనాలు అతని తల్లికి చెందినవని తేలినట్లు పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.
కారు ప్రమాదం కేసును విచారించిన కమిటీ.. నిందితుడి రక్త నమూనాకు బదులు.. అతని తల్లి రక్త నమూనాను తీసుకున్నట్లు వెల్లడైంది. ఇందుకోసం వైద్యులకు రూ.3 లక్షలు లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలుడి రక్తనమూనాను తల్లి రక్త నమూనాలో మార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో నిందితుడు ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నాడని అతని స్నేహితులు పోలీసులకు తెలిపారు. 200 కిలోమీటర్ల వేగంతో కారును నడిపినట్లు వివరించారు.
Also Read : పోర్షే 911 నుంచి మొదటి హైబ్రిడ్ వెర్షన్.. 312 కిమీ వేగంతో దూసుకుపోతుంది..!
ప్రమాదం జరిగిన రోజే ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ హెడ్.. డాక్టర్ తావ్ డే, నిందితుడి తండ్రి ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నట్లు ఇప్పటికే కథనాలొచ్చాయి. నిందితుడి రక్తనమూనాను మార్చితే భారీ మొత్తం చెల్లించేలా డీల్ కూడా కుదిరినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో టీనేజర్ తల్లి శాంపిల్స్ ను బ్లడ్ టెస్ట్ కు ఇచ్చినట్లు దర్యాప్తులో రుజువైంది. బ్లడ్ శాంపిల్ ఇచ్చాక ఆచూకీ లేకుండా పోయారు. తన కొడుకుని రక్షించాలని ఆ తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు. బ్లడ్ శాంపిల్స్ మార్చి, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు నిందితుడి తల్లిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.