Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నుంచి ఇందుకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు ప్రారంభమయ్యాయి. జనవరి 21 వరకు నిరంతరాయంగా క్రతువులు జరగనున్నాయి.
Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నుంచి ఇందుకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు ప్రారంభమయ్యాయి. జనవరి 21 వరకు నిరంతరాయంగా క్రతువులు జరగనున్నాయి.
జనవరి 16న ఆలయ ట్రస్ట్ నియమించిన ప్రతినిధి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సరయూ నది ఒడ్డున ‘దశవిధ’ స్నానం, విష్ణుపూజ, గోపూజ వంటి క్రతువులు నిర్వహిస్తారు. జనవరి 17న రామ్లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుంది. మంగళ కలశంలో సరయూ జలాన్ని తీసుకొని భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరతారు. జనవరి 18న గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలతో సంప్రదాయ క్రతువులు ప్రారంభమవుతాయి. జనవరి 19న యజ్ఞం ప్రారంభం అవుతుంది. అనంతరం ‘నవగ్రహ’ ‘హవన్’ స్థాపన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జనవరి 20న రామజన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నీళ్లతో శుభ్రం చేస్తారు. తర్వాత వాస్తు శాంతి ‘అన్నాదివస్’ ఆచారాలను పండితులు వేదమంత్రాలతో నిర్వహిస్తారు. జనవరి 21న రామ్లల్లా విగ్రహానికి 125 కలశాలతో అభిషేకం నిర్వహిస్తారు. జనవరి 22న ప్రధాన ప్రాణ ప్రతిష్ఠ వేడుక మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలవుతుంది. రామ్లల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాపన చేస్తారు. ఈ రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా 7 వేల మందికి ఆలయ ట్రస్టు ఆహ్వానాలు పంపింది.