Puja Khedkar: తప్పుడు ధృవీకరణ పత్రాల సమర్పణ వ్యవహారంలో పూజా ఖేడ్కర్ పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేసింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆమె సర్వీస్ ఎగ్జామ్స్ రాయకుండా డిబార్ చేసింది. అంతేకాదు.. ఆమెపై క్రిమినల్ కేసులను సైతం నమోదు చేసింది. అయితే, ఆమె కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణలో ఉంది.
ఇదిలా ఉంటే.. డిస్మిస్డ్ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ యూపీఎస్సీపై తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునే అధికారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు లేదన్నారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కు మాత్రమే అఖిల భారత సర్వీసుల చట్టం కింద చర్యలు తీసుకునే వీలుందన్నారు. తాను ఎలాంటి ఫోర్జరీ చేయలేదని, తప్పుడు సమాచారం ఇవ్వలేదంటూ కోర్టుకు విన్నవించారు.
Also Read: ఉపేక్షించింది ఇక చాలు.. మేలుకోండి: కోల్కతా రేప్ ఘటనపై రాష్ట్రపతి
కాగా, మాజీ ఐఏఎస్ ప్రొబేషర్ పూజా ఖేడ్కర్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను యూపీఎస్సీ తోసిపుచ్చింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కమిషన్ కు, పబ్లిక్ కు వ్యతిరేకంగా ఆమె ఫ్రాడ్ చేశారంటూ ఈ సందర్భంగా పేర్కొన్నది. ఇతరుల సహాయం లేకుండా ఇటువంటి అవకతవకలు జరిగి ఉండవన్నది. ఈ ఫ్రాడ్ ఎంత లోతుగా జరిగిందని తెలుసుకోవాలంటే కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని స్పష్టం చేసింది. ఆ కారణంగా ముందస్తు బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చాలని కోర్టును విన్నవించింది. ఢిల్లీ పోలీసులు సైతం పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ అభ్యర్థనను కూడా తోసిపుచ్చాలంటూ యూపీఎస్సీ కోర్టును కోరింది. కేసులో మరింత లోతైన దర్యాప్తునకు ముందస్తు బెయిల్ అవరోధమవుతుందంటూ న్యాయస్థానంలో వాదించారు.
అయితే, పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని జులై 31న యూపీఎస్సీ రద్దు చేయగా, ఐపీసీ, ఇన్ పర్ఫ్మేషన్ టెక్నాలజీ యాక్, రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డసేబిలిటీ యాక్ట్ కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇచ్చేంతవరకూ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఖేడ్కర్ కోరారు. దీంతో ఆగస్టు 29 వరకు ఖేడ్కర్ కు అరెస్ట్ నుంచి ముందస్తు రక్షణ కల్పించింది న్యాయస్థానం.
Also Read: కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. దేశవ్యాప్తంగా 12 స్మార్ట్ సిటీస్.. ఏపీ, తెలంగాణలో ఎన్నంటే?
ఇది ఇలా ఉంటే.. పూజా ఖేడ్కర్ పేరు ఇటీవలే దేశవ్యాప్తంగా మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. పుణెలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెపై అధికార దుర్వినియోగంతోపాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు భారీగా వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన యూపీఎస్సీ.. ఆమెను ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రీ జాతీయ అకాడమీకి తిరిగి రావాలంటూ ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఆ తరువాత పూజా ఖేడ్కర్ పై ఫోర్టరీ కేసు నమోదు చేయడంతోపాటు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.