ఒకప్పుడు భారతదేశం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పాగా వేసేది. ఉత్తర దక్షిణ అన్న భేదం లేకుండా అంతటా దాని ప్రాభవాన్ని చూపించేది. ఇప్పుడు టైమ్ మారింది. పార్టీ కష్టకాలంలో ఉంది.
మెదక్ నుంచి ఇందిరాగాంధీ…
గత మూడు ఎన్నికల్లోనూ కేంద్రంలో హస్తం పాచికలు పారలేదు. కేంద్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు ఆ పార్టీ అన్ని అస్త్రాలను ప్రయోగించింది. కానీ ఫలితం మాత్రం రావట్లేదు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీని దక్షిణ భారత్ వైపు పంపించింది ఆ పార్టీ అధిష్టానం. గతంలో తన నాయనమ్మ ఇందిరా గాంధీ ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించింది.
వయనాడ్ గెలుపు, కాంగ్రెస్ మలుపు…
అనంతరం చాలా ఏళ్లకు ఆమె మనవడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ స్థానంలో పాగా వేశారు. గాంధీ నెహ్రూ ఫ్యామిలీ కంచుకోట అయిన రాయబరేలీ, అమేథీ స్థానాల్లో 2019 ఎన్నికల్లో రాహుల్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అనంతరం 2024 సాధారణ ఎన్నికల్లో రాయబరేలీతో పాటు వయనాడ్’లోనూ పోటీ చేశారు. ఈ మేరకు వయనాడ్’లో గెలిచి పరువు దక్కించుకున్నారు. అయితే తన తల్లి, మాజీ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ స్థానంలో ఎంపీగా కొనసాగేందుకే రాహుల్ మొగ్గుచూపించారు. దీంతో వయనాడ్ ఎంపీగా రాజీనామా సమర్పించారు. ఈ క్రమంలోనే వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
హైకమాండ్ అలెర్ట్…
ముందే అప్రమత్తమైన కాంగ్రెస్ హైకమాండ్ వయనాడ్ బరిలో అన్న బదులుగా చెల్లెను, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని బరిలోకి దింపేందుకు సర్వ సన్నద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రాగానే, అదే రోజు ప్రియాంకను తమ అభ్యర్థిగా ప్రకటించేసింది. దీంతో కేరళ కాంగ్రెస్’లో జోష్ నింపడం ద్వారా దక్షిణాది భారతంలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం కోసం దిల్లీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తర భారతంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అన్న రాహుల్ గాంధీ మోయనున్నారట.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక…
చాలా కాలంగా ప్రియాంక పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ ఆమె పనిచేస్తున్నారు. కానీ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగలేదు. దివంగత మాజీ ప్రధాని కూతురు ప్రియాంక గాంధీ, కేరళలో పోటీ చేయడం ద్వారా దక్షిణ భారతంలోని తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లోనూ పార్టీని మరింత పటిష్టం చేయనున్నారట. శ్రేణులను అధికారం వైపు నడిపించనున్నట్లు పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది.
తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్’దే…
దక్షిణాదిలో కాంగ్రెస్ ప్రభుత్వాలున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు వచ్చే సాధారణ ఎన్నికల్లో కీలకంగా మారతాయి. వీటితో పాటు కేరళ, తమిళనాడులోనూ ఎక్కువ సీట్లు సాధిస్తేనే 2029లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ సర్కారు ఏర్పడుతుంది. ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల పోటీతో కేంద్రంలో యూపీఏ-3 సర్కారు ఏర్పాటు చేయడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
నాయనమ్మ మాదిరే మనవరాలు చరిష్మా…
ప్రసంగాల్లోనూ, హావ భావాల్లోనూ, నడవడికలోనూ తన నాయనమ్మ ఇందిరా గాంధీని తలపిస్తున్న ప్రియాంక జనాలను ఇట్టే ఆకట్టుకుంటారని అంతా ఆశిస్తున్నారు. తన చరీష్మాతో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో ఎంపీలను గెలవడం ప్రియాంక ముందున్న బిగ్ టాస్క్. ఈ మేరకు దిల్లీలో కాంగ్రెస్ విజయవంతం అయ్యేందుకు ఏఐసీసీ నేతలు ప్రియాంకతో భారీ ప్రణాళికనే అమలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
also read : గ్రేటర్ హైదరాబాద్ కొత్త కమిషనర్గా ఇలంబర్తి, పలువురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు