Hindu temple in Abu Dhabi (Live updates): భారత ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబీలో పర్యటిస్తున్నారు. అక్కడి బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ సొసైటీ నిర్మించిన సువిశాలమైన తొలి హిందూ దేవాలయం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ అబుదాబీలో తొలి దేవాలయాన్ని ప్రారంభించారు. ఈ దేవాలయాన్ని 27 ఎకరాల స్థలంలో నిర్మించారు. అరబ్ దేశాల్లో ఇదే అతిపెద్ద ఆలయం కావడం విశేషం. ఇది అబుదాబిలోని మొట్టమొదటి రాతితో నిర్మించిన హిందూ దేవాలయంగా ప్రసిద్ది పొందింది.
ఆలయంలో హిందూ దేవతలకు హారతి ఇచ్చారు పీఎం మోదీ. ఆలయ ప్రారంభానికి విచ్చేసిన ప్రధాని మోదీని చూసేందుకు భారతీయ పౌరులు పెద్దఎత్తున తరలివచ్చారు. వారికి అభివాదం తెలియజేశారు మోదీ. బాలీవుడు నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అరబ్ ఎమిరేట్స్లోని ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఏడు గోపురాలతో నిర్మించారు ఈ ఆలయాన్ని. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని నిర్మాణంలో వినియోగించారు. దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆలయానికి రెండు వైపులా భారత్ నుంచి భారీ కంటైనర్లలో తీసుకువచ్చిన పవిత్ర గంగా, యమునా నదీజలాల ప్రవాహాన్ని ఏర్పాటు చేశారు. ఇది వారణాసి ఘాట్లను తలపించేలా ఉంది.