Sengol : కొత్త పార్లమెంట్ భవనంలోని లోకసభ ఛాంబర్లో రాజదండాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠించారు. లోకసభ స్పీకర్ కుర్చీ పక్కన అద్దాల పెట్టెలో చారిత్రాత్మక సెంగోల్ను ఏర్పాటు చేశారు. రాజదండానికి తొలుత తమిళనాడు నుంచి వచ్చిన మఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం నుంచి నేరుగా సెంగోల్ దగ్గరకు ప్రధాని చేరుకున్నారు. మఠాధిపతులకు నమస్కరించారు. తర్వాత సెంగోల్కు మోదీ సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత మఠాధిపతులు సెంగోల్ను ప్రధాని చేతికి అందజేశారు. మఠాధిపతులు వెంటరాగా నాదస్వరం, భజంత్రీల మధ్య ప్రధాని రాజదండాన్ని లోక్సభలోకి తీసుకెళ్లారు. స్పీకర్ ఆసనం పక్కన సెంగోల్ ను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారత్కు స్వాతంత్య్రం ఇచ్చే సమయంలో అధికార మార్పిడి కోసం రాజదండం అంటే సెంగోల్ తయారు చేశారు. తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనాన్ని సంప్రదించి మద్రాస్లోని స్వర్ణకారుడితో రాజదండం చేయించారు. వెండితో చేసి బంగారు పూత పూశారు. దీని పొడవు 5 అడుగులు .పై భాగంలో న్యాయానికి ప్రతీకగా నంది చిహ్నాన్ని అమర్చారు. తిరువడుత్తురై మఠానికి చెందిన ఒక స్వామీజీ ఆ దండాన్ని 1947 ఆగస్టు 14 రాత్రి నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్ర ప్రకటన చేయడానికి 15 నిమిషాల ముందు దానిని భారత నెహ్రూకి అందజేశారు. ఆ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను ఆలపించారు.
సెంగోల్ శబ్దం తమిళంలోని సెమ్మై నుంచి వచ్చింది. 8వ శతాబ్దంలో చోళుల కాలంనాటి నుంచి రాజదండం చేతుల మారడం ద్వారా అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది. సెంగోల్ ఎవరు అందుకుంటారో వారి నుంచి న్యాయ, నిష్పాక్షిక పాలనను ప్రజలు ఆశిస్తారు. స్వాతంత్య్ర ప్రకటన సమయంలో సెంగోల్ స్వీకరణ ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా మీడియా ప్రచురించింది. టైమ్ మేగజైన్ తోపాటు, పలు దేశాల్లో పత్రికలు కథనాలు ప్రచురించాయి.
గతంలో ఈ రాజదండం గుజరాత్లోని అలహాబాద్ మ్యూజియంలో ఉండేది. గతేడాది నవంబర్ 4న అక్కడ నుంచి ఢిల్లీ జాతీయ మ్యూజియానికి తీసుకొచ్చారు. సెంగోల్ అంటే అర్థం సంపద నుంచి సంపన్నం అని. దీని మూలాలు దేశ వారసత్వపరంపరతో ముడిపడి ఉన్నాయి.