Ayodhya : కోట్లాది మంది రామభక్తుల కల అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది. మరికొన్ని గంటల్లో అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ మహోజ్వల క్షణాల కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది భక్తి శ్రద్ధలతో ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో అయోధ్యలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. హిందూవుల దశాబ్ధాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఆనాటి పట్టాభిషేక కార్యక్రమాన్ని మరిపించేలా ప్రాణప్రతిష్ట వేడుకను జరిపేందుకు అయోధ్య ముస్తాబైంది. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. వీఐపీలంతా అయోధ్య చేరుకున్నారు. అయితే 1528 లో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదానికి.. ప్రాణప్రతిష్టతో ఎండ్ కార్డ్ పడింది.
రామమమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపించింది. మరికొద్ది గంటల్లో అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా ప్రముఖులు, ఇతరులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ప్రారంభమయ్యే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఒంటి గంటకు ముగియనుంది. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. 13 వేల మంది పోలీసు సిబ్బందితో.. అంచెలంచెలుగా బందోబస్తు, నగరవ్యాప్తంగా సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేశారు. జాగిలాలు, బాంబు స్క్వాడ్ బృందాలను మోహరించారు.
అంతా రామమయమే.. అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలు.. ఆధ్యాత్మిక కోలాహలమే. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆధ్యాత్మికశోభ ఉట్టిపడేలా భారీ సెట్టింగులు.. రంగురంగుల విద్యుద్దీపాలు.. పూలతో ద్వారాల అలంకరణ, రంగవల్లులతో ముస్తాబు చేసిన లోగిళ్లతో అయోధ్య నగరం చూడముచ్చటగా ఉంది. యావత్దేశం వేచిచూస్తోన్న సుదీర్ఘ స్వప్నం మరికొన్ని గంటల్లో సాకారం కాబోతోంది. ఈ చారిత్రక వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
దాదాపు ఏడు వేల మంది అతిథులు పాల్గొనే ఈ మహాఘట్టాన్ని కోట్లాది ప్రజలు టీవీ, ఆన్లైన్ వేదికల్లో ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనున్న వేళ భారత్లోనే కాకుండా విదేశాల్లోనూ పలు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే ఈ వేడుక గురించి,కేంద్ర ప్రభుత్వం హాఫ్ డే సెలవు ప్రకటించగా.. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థలు, గ్రామీణ బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకూ మూతబడనున్నాయి. అలాగే… ఎన్ఎస్ఈ, బీఎస్ఈ సైతం హాలీడే ప్రకటించాయి. దేశంలోని పలు రాష్ట్రాలు సైతం జనవరి 22న సెలవు ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ వేడుకను జాతీయ ఉత్సవంగా పేర్కొంటూ సెలవు ప్రకటించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా ప్రభుత్వాలు పూర్తి సెలవు ప్రకటించగా.. హరియాణా ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కళాశాలలు, కార్పొరేషన్లకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు వరకు సెలవు ఇచ్చింది.
.
.