Prajwal Revanna Says will Appear before Police: తనపై లైంగిక వేధింపుల కేసుల నేపథ్యంలో కర్ణాటక జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. అతను దేశం విడిచి వెళ్లి దాదాపు నెల దాటిపోయింది. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నాడు. జర్మనీ నుంచి రేవణ్ణ ఓ వీడియోను విడుదల చేశాడు. తాను ఇండియాకు వచ్చి సిట్ ముందు హాజరవుతానని రేవణ్ణ పేర్కొన్నాడు. మే 31న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరుకానున్నట్లు రేవణ్ణ తెలిపాడు. ‘నాపై తప్పుడు కేసులు పెట్టారు. చట్టాన్ని నేను నమ్ముతాను. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మే 31న ఉదయం 10 గంటలకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరవుతాను, సహకరిస్తాను. నన్ను తప్పుపట్టవద్దు. నేను నిర్ధోషిగా తేలుతా’ అని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నాడు.
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇందుకు సంబంధించి పలు వీడియోలు బయటకు రావడంతో ఏప్రిల్ 26న అతను దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలను రాజకీయ కుట్రగా పేర్కొన్నాడాయన. ఈ ఆరోపణల నేపథ్యంలో తాను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, తన ఆచూకీ చెప్పనందుకు పార్టీ కార్యకర్తలకు ప్రజ్వల్ క్షమాపణలు చెప్పాడు.
Also Read: మంత్రి బంగ్లాలో విడ్డూరం.. వేప చెట్టుకు కాస్తున్న మామిడి పండ్లు!
కాగా.. ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లిపోయి నెల రోజులవుతుంది. అతని ఆచూకీని స్పెషల్ ఇన్విస్టిగేషన్ ఫోర్స్ గుర్తించలేకపోయింది. నాలుగుసార్లు నోటీసులు ఇచ్చారు. ఒక అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. దౌత్య పాస్ పోర్టును రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు ప్రారంభించింది. విచారణకు హాజరుకావాలంటూ ఇటు మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ, ఆయన తండ్రి హెచ్ డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి బహిరంగ విన్నపాలు కూడా చేశారు. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ.. సిట్ ముందు హాజరవుతాని పేర్కొన్నాడు.