జమ్ముకశ్మీర్ లోని పూంచ్ సెక్టార్లో ఐదుగురు జవాన్లను ఊచకోత కోసిన ముష్కరుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది భారత ఆర్మీ. పూంచ్లో పరిస్థితిని స్వయంగా సమీక్షించారు ఆర్మీ చీఫ్ మనోజ్పాండే. ఈ నెల 21న పూంచ్లో సైన్యానికి చెందిన వాహనాలపై దాడి చేసి నలుగురు జవాన్లను హత్య చేసిన ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేటను ఆయన సమీక్షించారు. ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్లకు నేతృత్వం వహించే కమాండర్లు.. ప్రొఫెషనల్గా వ్యవహరించాలని సూచించారు మనోజ్ పాండే. ముష్కరులను వేటాడే ఆపరేషన్లో భాగంగా కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది భారత ఆర్మీ. అందులో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దుమారం రేపింది. దీంతో ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించిన ఆర్మీ.. బ్రిగేడియర్ స్థాయి అధికారిని బదిలీ చేసింది. 48వ రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ముగ్గురు జవాన్ల కూడా విధుల నుంచి తప్పించింది.
జమ్మూ డివిజన్లోని పూంచ్, రాజోరి జిల్లాల్లో భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ ఐదో రోజు కొనసాగుతోంది. ఇప్పటికే రాజౌరికి అదనపు బలగాలను తరలించారు. సరిహద్దులపై హెలికాప్టర్లతో నిఘా పెట్టారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ బృందాలు జల్లెడపడుతున్నాయి. ఆపరేషన్ నాలుగో రోజు రెండు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పూంచ్లో ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందిన భారత సైనికుల త్యాగం దృష్ట్యా జమ్మూ చేరుకున్నారు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే. రాజౌరీ-పూంచ్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద ఘటనలు, ఉగ్రవాద నిరోధక గ్రిడ్ను పటిష్టం చేయడంపై అధికారులతో సమీక్షించారు ఆర్మీ చీఫ్. ఉత్తర కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జమ్మూకు చెందిన వైట్ నైట్ కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్ మరియు సీనియర్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు అధికారులు నిఘా కోసం రాజౌరీ-పూంచ్లో క్యాంప్ చేస్తున్నారు.
మరోవైపు అమరులైన ఐదుగురు జవాన్ల భౌతికకాయాలను స్వస్థలాలకు తరలించారు. కాన్పూర్కు చెందిన కరణ్సింగ్ యాదవ్కు కన్నీటి వీడ్కోలు పలికారు స్థానికులు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. అటు ఉగ్రవాదుల దాడులకు నిరసనగా జమ్ములో నిరసనలు కొనసాగుతున్నాయి. డోగ్రా ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి.. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూంచ్ జిల్లాలోని సావ్ని ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలో అనుమానాస్పద స్థితిలో ముగ్గురు గ్రామస్తుల మృతదేహాలను వెలికితీయడంపై అంతర్గత దర్యాప్తు ప్రారంభించింది ఆర్మీ. మరోవైపు కూంబింగ్తో ముగ్గురు స్థానికులు చనిపోవడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.