Political Leaders for votes(Political news telugu):
రాజకీయాలలో గెలుపోటములు సహజం. ఎవరైతే ప్రజల పక్షాన ఉంటారో, ఎవరైతే సంక్షేమ పథకాల కోసం పాటుపడతారో ప్రజలు వారినే గుర్తించుకుంటారనేది యథార్థం. అయితే కొందరు నేతలు అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాటుపడుతుంటారు. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి ఎలాగోలా తిరిగి తమ ప్రభుత్వమే రావాలని కోరుకుంటారు. ఇందుకోసం అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుని విపక్షాలపై విరుచుకుపడుతుంటారు. ఏం చేస్తే ప్రజల నుంచి సానుభూతి పొందవచ్చో దానినే అనుసరిస్తుంటారు.
సామదాన దండోపాయాలు
అతడు సినిమాలో షియాజీ షిండే తాను అధికారంలోకి రావడానికి తనపై తానే హత్యా యత్నం చేయించుకుంటాడు సుపారీ ఇచ్చి. పైగా దీని వలన సానుభూతి ఓట్లు పడతాయని చెబుతాడు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు తనదైన శైలిలో రాసి ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అంతా అదే తరహా రాజకీయాలు నడుస్తున్నాయనిపిస్తోంది.అధికార పక్ష నేతలు గానీ, ప్రతిపక్ష నేతలు గానీ ఎన్నికలలో సామదానదండోపాయాలను ప్రయోగిస్తుంటారు. ఎలాగైనా అధికారంలోకి రావాలంటే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టాలని అనుకుంటారు. ఒకప్పుడు కోట్లు ఓట్లు కురిపించేవి. కానీ పరిస్థితి మారింది. ఓటర్ల మనసులు చూరగొనాలంటే వారినుంచి ఎలాగైనా సానుభూతి కూడా పొందాలి. అనుకుంటున్నారు.
ట్రంప్ పై దాడి నిజమేనా?
ఇటీవల అమెరికాలో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ పై ప్రత్యర్థులు చేసిన దాడిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బైడెన్ ను ఈ ఎన్నికలలో ఎలాగైనా ఓడించి తిరిగి తాను అధ్యక్ష పీఠం అధిరోహించడానికి ట్రంప్ అహర్నిశలూ కష్టపడుతున్నారు. బైడెన్ వయసు రీత్యా మతిపరుపు వచ్చిందని..అతనికి మతి స్థిమితం లేదని కూడా ప్రచారం చేస్తూ వచ్చిన ట్రంప్ ఇక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ గెలవాలనే ఆరాటం ఎక్కువయింది. అందుకే తనపై తానే ఈ దాడులు చేయించుకుని ఉండవచ్చు సానుభూతి కోసం అని కొందరు వాదిస్తున్నారు. అయితే ట్రంప్ అభిమానులు ఈ కామెంట్స్ ను కొట్టిపారేస్తున్నారు. నిందితుడు కూడా దొరికాడని..ట్రంప్ ప్లాన్ చేసివుంటే నిందితుడు దొరికేవాడు కాదని చెబుతున్నారు.
గులకరాళ్లు, కోడి కత్తి
మొన్నటి ఏపీ ఎన్నికల ముందు అధికారంలో ఉన్న జగన్ మళ్లీ తానే సీఎం అవుతానని వైనాట్ 175 అని ప్రచారం ముమ్మరం చేశారు. తనని సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని అనుకున్నారు. వాస్తవానికి జగన్ కక్ష తరహా రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్టు చేసి జైలులో ఉంచడం ద్వారా చంద్రబాబు పై జనం సానుభూతి పెరిగిందని జగన్ ఓటమికి ఇది కూడా ఓ కారణమని రాజకీయ పండితులు చెబుతున్నారు. అయితే ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ జగన్ పై ఓ అజ్ణాత వ్యక్తి గులకరాయి విసరడంతో కణితికి గాయం అయిందని బ్యాండేజీ వేసుకునే ప్రచారం సాగించారు. తెలుగుదేశం శ్రేణులు అదంతా జగన్నాటకం అని కొట్టిపారేశాయి. అంతకు ముందు కూడా విశాఖ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి జగన్ పై కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. అయినా ఎన్నికలలో కోడికత్తి, గులకరాయి దాడులు ఏమీ పనిచేయలేదు. జగన్ తీవ్ర ఓటమి చవిచూడాల్సి వచ్చింది.తమిళనాడులోనూ ఈ తరహా దాడులు జరిగాయి కానీ ఆయా సందర్భాలను బట్టి నేతలు గెలుపోటములు చవిచూశారు.
దీదీని గెలిపించిన గాయం
పశ్చిమ బెంగాల్ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా మొన్నటి ఎన్నికలలో తనకు గాయమైందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె నుదుటి నుంచి రక్తం కారుతున్న ఫొటోలు వైరల్ గా మారాయి. అయితే దీనిపై అప్పట్లో బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇదంతా దీదీ ఎన్నికల స్టంట్ అని కొట్టిపారేసింది. అయినా ఆ ఎన్నికలలో మమతా బెనర్జీ అఖండ విజయం సాధించారు. ఒకప్పుడు ఇందిరాగాంధీపై జరిగిన కాల్పులతో ఆమె మృతి చెందగా ఆ తర్వాత సానుభూతి ఓట్ల ప్రభంజనంతో రాజీవ్ గాందీ అధికారంలోకి వచ్చారు. రాజీవ్ కూడా తమిళనాడు పెరంబుదూర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సానుభూతి అనేది ప్రతిసారీ వర్కివుట్ కాదన్న సంగతి రాజకీయ నేతలు గ్రహించాలి. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలపై పోరాడేవారినకే జనం ఓట్లేస్తారని తెలుసుకోగలగాలి.