Rat : ఎలుకను చంపిన వ్యక్తిపై కేసు నమోదైంది. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ రిపోర్టు, వీడియోలు, వివిధ విభాగాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పోలీసులు ఛార్జిషీట్ రూపొందించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం గతేడాది నవంబర్లో మనోజ్ కుమార్ శర్మ అనే వ్యక్తి ఓ ఎలుక తోకకు రాయి కట్టి మురుగు కాల్వలోకి విసిరాడు. ఈ ఘటన చూసిన జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలుకను కాపాడేందుకు ప్రయత్నించానని తెలిపారు. అయితే అప్పటికే చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మనోజ్ కుమార్పై ఐపీసీ సెక్షన్ 429తోపాటు జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఎలుక కళేబరాన్ని తొలుత బదాయూలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ పశువైద్యులు శవపరీక్ష చేసేందుకు నిరాకరించారు. అనంతరం ఎలుక కళేబరాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు తీసుకెళ్లారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఎలుక చనిపోయిందని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా యూపీ పోలీసులు తాజాగా బదాయూ కోర్టులో నిందితుడిపై 30 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ కేసులో మనోజ్ కుమార్ దోషిగా తేలితే జంతు హింస నిరోధక చట్టం కింద గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఐపీసీ సెక్షన్ 429 కింద ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. తన కుమారుడిపై చర్యలను మనోజ్ కుమార్ తండ్రి మథుర ప్రసాద్ ఖండించారు. తన కుమారుడు చేసింది నేరమైతే కోళ్లు, మేకలు, చేపలను చంపే వ్యక్తులను కూడా శిక్షించాలని కోరారు. అలాగే ఎలుకలను చంపడానికి మందులు అమ్మేవాళ్లను కూడా శిక్షించాలన్నారు.