Pocso Case on Yediyurappa(Telugu breaking news): లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప(81)పై సదాశివనగర్ పోలీస్స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 17 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక దాడి చేశారంటూ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 2న తన కుమార్తెను లైంగికంగా వేధించాడని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది.
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప వయసు 81 ఏళ్లు. ఆయన లైంగికంగా వేధించారని చెప్తున్న బాధితురాలి వయసు 17 ఏళ్లు. పోక్సో చట్టంలోని సెక్షన్ 8తో పాటు.. ఐపీసీ సెక్షన్ 354A నమోదు చేశారు. ఓ లైంగిక వేధింపుల కేసులో యడియూరప్ప సాయం తీసుకునేందుకు తల్లికూతురు వెళ్లగా.. యడ్డీ కూడా తమ కూతురిపై వేధింపులకు పాల్పడ్డాడని తల్లి ఆరోపిస్తోంది. ఫిబ్రవరి 2వ తేదీన ఆ ఘటన జరిగినట్టు చెప్తోంది. సహాయం కోసం ఆయనను ఆశ్రయిస్తే.. తన కూతురిని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోక్సో చట్టం కింద నేరం రుజువైతే మినిమం మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.
Also Read : ఎలక్టోరల్ బాండ్ డేటా వెల్లడించిన ఎన్నికల సంఘం.. భారీగా విరాళాలు
కాగా.. ఈ ఆరోపణలపై యడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు. కానీ యడ్డీ కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది. గతంలోనూ వాళ్లు పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారని, ఇప్పటి వరకూ ఇలా 53 ఫిర్యాదులు చేశారని చెబుతూ ఒక లిస్ట్ ను విడుదల చేసింది. నాలుగుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేసిన యడియూరప్ప.. సీఎం పదవిని వీడాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గతేడాది నవంబర్ లో ఆ బాధ్యతలను ఆయన కుమారుడైన విజయేంద్ర అప్పగించడంతో.. ఆయన ప్రస్తుతం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా ఉన్నారు.