Hiraben Modi:ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్న ఆమె.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.
తల్లి హీరాబెన్ మృతితో శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ కు బయలుదేరారు ప్రధాని మోదీ. అక్కడినుంచి గాంధీనగర్లోని తన తల్లి నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీ తల్లి అంతిమయాత్రలో పాల్లొన్నారు. తన తల్లి భౌతికకాయానికి నివాళులర్పిచారు. అనంతరం అంతిమయాత్రలో భాగంగా తానే స్వయంగా తన తల్లి పాడెను మోశారు ప్రధాని మోదీ.
తల్లి హీరాబెన్ మరణంపై ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తిచేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది. సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నా’’ అని ప్రధాని అన్నారు.