PM Narendra Modi Speech in Telugu: తెలుగు ఎంతో అద్భుతమైన భాష అని మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆదివారం తన 113వ మన్ కీ బాత్ లో వివిధ అంశాలపై మాట్లాడారు. ఇందులో భాగంగా ఈనెల 29 న తెలుగు భాషా దినోత్సవం జరుపుకోబోతున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. మన్ కీ బాత్ లో తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ మేరకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో చెప్పారు.
అనంతరం అంతరిక్ష రంగంపై పారిశ్రామిక వేత్తలతో మాట్లాడారు. అంతరిక్ష రంగంలో దేశం వేగంగా వృద్ధి చెందుతోందని వెల్లడించారు. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని అన్వేషించిన మొదటి దేశంగా భారత్ నిలిచిందన్నారు. చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా స్పేస్ డే నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తొలి అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించుకున్నామన్నారు.
వికసిత్ భారత్ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన పిలుపు మేరకు యువత రాజకీయాల్లోకి వస్తుందన్నారు. ఇప్పటికే కొంతమంది ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. యువతకు సరైన అవకాశంచ మార్గదర్శకత్వం కావాలన్నారు.
Also Read: 2026 నాటికి నక్సలిజం రూపుమాపుతాం.. కేంద్ర మంత్రి అమిత్ షా
ఈ ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారం పెద్ద ఎత్తున ఉద్యమంలా సాగిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాలు వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సామాజిక వేడుకగా మారిందన్నారు. తన పిలుపు మేరకు 5 కోట్ల మంది తమ ఫొటోలను అప్ లోడ్ చేసినట్లు వెల్లడించారు.