PM Modi’s Video Message: దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనున్నది. ఈ నేపథ్యంలో వారణాసి ఓటర్లకు ప్రధాని మోదీ వీడియో సందేశం పంపారు. ‘మీరు వేసే ఒక్కో ఓటు నన్ను మరింత బలపరుస్తుంది. జూన్ 1న కాశీ ప్రజలు కొత్త రికార్డును సృష్టించాలి. ఓటర్లందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి పోలింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి. భక్తి, శక్తి, విరక్తికి ప్రతీక కాశీ. వారణాసి ప్రపంచానికి సాంస్కృతిక రాజధాని. సంగీతం, శాస్త్రాలకు కాశీ నిలయం. విశ్వనాథుని కృప వల్లే కాశీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాను. గంగా నది నన్ను అక్కున చేర్చుకున్నది’ అంటూ ఆ వీడియో సందేశంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. వారణాసి లోక్ సభ స్థానం నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తున్నారు.
కాగా, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ఆరు దశల్లో పోలింగ్ పూర్తి అయ్యింది. 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనున్నది. ఎనిమిది రాష్ట్రాలు, మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 57 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది. ఈ పోలింగ్ లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనున్నది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ నుంచి 13 స్థానాలకు, పశ్చిమబెంగాల్ నుంచి 9 స్థానాలకు, బీహార్ నుంచి 8 స్థానాలకు, ఒడిశా నుంచి 6 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్ నుంచి 4 స్థానాలకు, జార్ఖండ్ నుంచి 3 స్థానాలకు, చండీగఢ్ నుంచి ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనున్నది.
Also Read: ముగియనున్న కేజ్రీవాల్ బెయిల్ గడువు.. రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్
ఇప్పటివరకు మొదటి దశలో 102 నియోజకవర్గాల్లో 66.14 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. రెండో దశలో 88 నియోజకవర్గాల్లో 66.71 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మూడో దశలో 94 నియోజకవర్గాల్లో 65.68 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగో దశలో 96 నియోజకవర్గాల్లో 69.16 శాతం పోలింగ్ నమోదైంది. ఐదో దశలో 49 నియోజకవర్గాల్లో 62.2 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇక ఆరో దశలో 57 నియోజకవర్గాల్లో 61.98 శాతం పోలింగ్ నమోదైంది. 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.