Rahul Gandhi Comments on Priyanka Gandhi: ప్రియాంక గాంధీ వాద్రా వారణాసి లోక్సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ప్రధాని నరేంద్ర మోదీని రెండు నుంచి మూడు లక్షల ఓట్లతో ఓడించి ఉండేవారని ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో మూడు లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన రాయ్బరేలీలో రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారు.
తాను అహంకారంతో ఈ మాటలు అనడం లేదని.., ప్రధానమంత్రి రాజకీయాలు తమకు నచ్చడం లేదని భారత ప్రజలు ఆయనకు సందేశం పంపారు కాబట్టి తాను ఈ మాట చెబుతున్నానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ద్వేషం, హింసకు వ్యతిరేకంగా తాము నిలబడతామనే సందేశాన్ని ప్రజలు గట్టిగా పంపారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
అయితే ఈ లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అందరూ ఊహించారు. అమేథీ లేదా రాయ్బరేలీ లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేస్తారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్బరేలి బరిలో నిలిచారు. ప్రియాంక గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారనుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కే ఎల్ శర్మకు సీటు కేటాయించారు. కే ఎల్ శర్మ బీజేపీకి చెందిన సృతి ఇరానీపై లక్షా 60 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Also Read: వాజ్పేయ్ గవర్నమెంట్ పడిపోడానికి కారణమేంటో తెలుసా.. మరోసారి మోదీ ఆ సాహసంచేస్తారా..?
లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ యూపీ నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. అయితే, 2019, 2014 ఎన్నికల కంటే అతని గెలుపు మార్జిన్ తగ్గింది. ఇక మొత్తంగా దేశవ్యాప్తంగా 2024 లోక్సభ ఎన్నికల్లో 543 సీట్లలో NDA 293 గెలుచుకుంది. ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు. అయితే లోక్సభలో బీజేపీ 240 సీట్లు గెలుచుకుని సొంతంగా మెజారిటీ మార్కును సాధించింది.
ఇక ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను కైవసం చేసుకుంది. గత రెండు ఎన్నికల కంటే ఈ సారి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది.