PM Modi Tour Schedule: కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మరోవైపు ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల పర్యటనకు సిద్ధమయ్యారు. 10 రోజులపాటు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 29 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
ఏప్రిల్-మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల జరుగుతాయని భావిస్తున్నారు. షెడ్యూల్ మరికొన్ని రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అందువల్లే రాష్ట్రాల్లో పర్యటనలకు ప్రధాని మోదీ శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, జమ్మూకాశ్మీర్, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్ , ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలో మోదీ పర్యటిస్తారు.
తెలంగాణ నుంచి మోదీ పర్యటన షురూ కానుంది. మార్చి 4న ఆదిలాబాద్ జిల్లాలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలోనూ ప్రసంగిస్తారు. అదే రోజు తమిళనాడుకు వెళతారు. కల్పకంలో బహిరంగ సభలో మోదీ మాట్లాడతారు.
Read More: బీజేపీకి భోజ్పురి సింగర్ పవన్ సింగ్ షాక్.. పోటీకి విముఖత..
మార్చి 5న మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. అనేక ప్రాజెక్టులను ప్రారంభిన తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు ప్రధాని ఒడిశా పర్యటనకు వెళ్తారు. చండీఖోలేలో నిర్వహించే బహిరంగలో మాట్లాడతారు. మార్చి 6న పీఎం మోదీ కోల్కతాలో పర్యటిస్తారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. బరాసత్ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి బిహార్ లోని బెట్టియాకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే వివిధ పనులకు శంకుస్థాపనలు చేస్తారు.
మార్చి 7న ప్రధాని మోదీ జమ్మూకాశ్మీర్ లో పర్యటిస్తారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీలో జరిగే మీడియా కార్యక్రమానికి హాజరవుతారు. మార్చి 8న ఢిల్లీలో తొలిసారి నిర్వహించనున్న నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత అస్సాంలోని జోర్హాట్లో లెజెండరీ అహోం ఆర్మీ కమాండర్ లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభిస్తారు. అలాగే పలు పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ కు వెళతారు. వెస్ట్ కమెంగ్లో సెలా టన్నెల్ను ప్రారంభిస్తారు. ఈటానగర్లో వివిధ ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్కు మోదీ వెళతారు. సిలిగురిలో అభివృద్ధి పనులను ప్రారంభి బహిరంగ సభలోనూ మాట్లాడతారు.
మార్చి 10న ప్రధాని మోదీ ఉత్తర్ప్రదేశ్ పర్యటనకు వెళతారు. అజంగఢ్లో ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. మార్చి 11 న ఢిల్లీకి మరోసారి వచ్చి వివిధ కార్యక్రమాలకు హాజరవుతారు. తర్వాత ద్వారకా ఎక్స్ప్రెస్వేలోని హర్యానా సెక్షన్ను ప్రారంభిస్తారు. ఆ రోజే డీఆర్డీవో కార్యక్రమంలోనూ పాల్గొంటారు.
మార్చి 12న గుజరాత్ లోని సబర్మతిలో మోదీ పర్యటిస్తారు. అలాగే రాజస్థాన్లోని పోఖ్రాన్ లో వివిధ ప్రోగామ్స్ కు హాజరవుతారు. మార్చి 13న గుజరాత్, అస్సాంలో సెమీకండక్టర్ల ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ శంకుస్థాపన చేస్తారు.