PM Modi to visit Jammu and Kashmir: ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకాశ్మీర్ లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి ఆయన అక్కడ పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పలు ప్రాజెక్టులకు మోదీ శుంఖుస్థాపనలు చేయనున్నారు. అదేవిధంగా పలు ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. అయితే.. శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న మొత్తం 84 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ. 1500 కోట్లు కేటాయించింది.
అదేవిధంగా ఎల్లుండి శ్రీనగర్ లో నిర్వహించే యోగా దినోత్సవంలో కూడా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. మూడోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా జమ్మూకాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూకాశ్మీర్ లో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైన విషయం తెలిసిందే. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహణకు ఇది అనుకూలమైన వాతావరణం అంటూ కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఇదిలా ఉంటే.. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. జమ్మూకాశ్మీర్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. దాల్ సరస్సు ఒడ్డున మోదీ యోగా చేయనుండగా, ఆ కార్యక్రమంలో దాదాపు ఏడు వేల మంది పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని పర్యవేక్షించేందుకు జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. యోగా డే సందర్భంగా మోదీ కశ్మీర్ లోయకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
గత పదేళ్లలో జాతీయ అంతర్జాతీయ వేదికలపై యోగా ఎంతో గుర్తింపు పొందిందన్నారు. ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమాల్లో 23.5 కోట్ల మందికిపైగా పాల్గొన్నారన్నారు. ఏటా యోగా చేసేవారి సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ విషయం హర్షించతగ్గదన్నారు. ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం కోసం ప్రజలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
Also Read: చిప్స్ ప్యాకెట్లో కుళ్లిపోయిన కప్ప.. షాకైన కస్టమర్.. తర్వాత ఏమైందంటే..?
ఇదిలా ఉంటే.. జమ్మూకాశ్మీర్ లో గత కొద్దిరోజులుగా వరుసగా ఉగ్ర ఘటనలు చోటు చేసుకోవడంతో ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ క్రమంలో ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అమర్ నాథ్ యాత్ర కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామంటూ ఆయన తెలిపారు.