Modi in Ayodhya: అయోధ్యలో బాల రాముడి దివ్యమనోహర విగ్రహ ప్రాణ ప్రతిష్టకు కౌంట్ డౌన్ కొనసాగుతూనే ఉంది. రామ మందిర నిర్మాణం శర వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అయోధ్య ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. నేడు వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రామాలయాన్ని జనవరి 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నారు.
అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకున్న అంతర్జాతీయ ఎయిర్పోర్టును, రైల్వేస్టేషన్ను నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక రైల్వే స్టేషన్ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వీని వైష్ణవ్ కూడా పరిశీలించారు.
ఎయిర్పోర్ట్కి రామాయణ ఇతిహాసాన్ని రచించిన మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అయోధ్య ధామ్గా నామకరణం చేశారు. ఇవాళ్టి నుంచే ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు ప్రారంభించబోతున్నారు. ఈ 2 విమానయాన సంస్థలు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రకటించాయి.
ఉదయం 11.15 నిమిషాలకు అయోధ్య రైల్వేస్టేషన్ను మోడీ ప్రారంభిస్తారు. కొత్తగా రూపుదిద్దుకున్న అమృత్ భారత్ రైళ్లు, 6 వందేభారత్ రైళ్లను జెండా ఊపి స్ట్రార్ట్ చేయనున్నారు. మధ్యాహ్నం 12.15 నిమిషాలకు అయోధ్య విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.
ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 15వేల700 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి సుమారు 11వేల 100 కోట్ల విలువైన ప్రాజెక్టులు, యూపీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి దాదాపు 4వేల600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇది కాకుండా.. అయోధ్య చుట్టుపక్కల సుందరీకరణ, పౌర సౌకర్యాల మెరుగుదలకు దోహదపడే అనేక కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు PMO తెలిపింది. అయోధ్యలోని అత్యాధునిక విమానాశ్రయం మొదటి దశను వెయి450 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. విమానాశ్రయ టెర్మినల్ భవనం 6వేల500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఏటా సుమారు 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలను అందించడానికి సిద్ధం చేసినట్లు వెల్లడించారు.