Modi Nomination: ప్రధాని మోదీ ఈ నెల 14న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మోదీ నామినేషన్ కోసం బీజేపీ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ సందర్భంగా మోదీ వారణాసిలో రెండు రోజుల పాటు ఉంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని ఉండే రెండు రోజుల్లో భారీ రోడ్ షోలు, ప్రచార సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది.
మోదీ నామినేషన్ ఏర్పాట్లను కేంద్ర మంత్రి అమిత్ షా, యూపీ సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత సునీల్ బన్సల్ కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వారణాసిలో ప్రధాని నామినేషన్ కు ముందు పలు ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంది. కాశీ విశ్వనాథుడు, కాలభైరవ ఆలయాలను మోదీ దర్శించుకోనున్నట్లు సమాచారం.
బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు ఐదు కిలోమీటర్ల మేర మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ రోడ్ షో కొనసాగనుంది. రోడ్ షో అనంతరం ఎన్డీఏ నేతలతో మోదీ సమావేశంలో పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ప్రధాని బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మే 30 వరకు మోదీ ఎన్నికల ప్రచారాలు కొనసాగనున్నాయి.
Also Read: 10 గ్యారంటీలతో అరవింద్ కేజ్రీ’వార్’
7వ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఉత్తర ప్రదేశ్ లోక్ సభ స్థానాల్లో వారణాసి ఒకటి. వారణాసి బీజేపీకి కంచుకోటగా చెబుతారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ సమాజ్ వాదీ పార్టీ నుంచి బరిలో దిగిన షాలినీ యాదవ్ పై విజయం సాధించారు. ఇక్కడ సుమారు 20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10.65 లక్షల మంది పురుషులు కాగా 8.97 లక్షల మంది మహిళలు, 135 థర్డ్ జెండర్స్ ఉన్నారు.