Ayodhya PM modi Speech : అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. 7 దశాబ్దాల హిందువుల నిరీక్షణకు నేటితో తెరపడింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా.. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణలు, జై శ్రీరామ్ నామస్మరణల మధ్య.. అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 84 సెకన్ల దివ్య అభిజిత్ లగ్నంలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. రాముడి ప్రాణప్రతిష్ట సమయంలో.. అయోధ్యనగరి మొత్తం జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగింది. పసిడి కిరీటం, పట్టువస్త్రం, ముత్యాల కంఠాభరణంతో దశరథ నందనుడు ధగధగ మెరిసిపోతున్నాడు.
రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట అనంతరం.. శ్రీ రామచంద్రమూర్తికి జై అంటూ ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. సరయూ నది, అయోధ్యపురికి నమస్కారాలు, రామ భక్తులందరికీ తన ప్రణామాలు తెలియజేశారు. అయోధ్యకు శ్రీరాముడు వచ్చాడంటూ.. సంతోషం వ్యక్తం చేశారు. రామమందిరం గర్భగుడిలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జనవరి 22వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మన రాముడొచ్చేశాడన్న విషయం.. ఎంతో అలౌకిక సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఈ క్షణం ఎంతో ప్రత్యేకమైనదని వివరించారు. ఎక్కడ రాముడి కార్యక్రమం జరుగుతుందో అక్కడ హనుమంతులవారుంటారన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటాలు, బలిదానాలు, నిష్ట తర్వాత ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రామాయణ కాలంలో 14 ఏళ్ల వనవాసం ఉంటే.. ఈ యుగంలో కొన్నివందల ఏళ్లు రాముడికోసం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
రామాలయ నిర్మాణానికి ఇన్నేళ్ల సమయం పట్టినందుకు.. రాముడు మనందరినీ క్షమిస్తాడని తనకు నమ్మకం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తన మనస్సంతా ఆ బాలరాముడి రూపంపైనే ఉందని, ఇప్పటికీ తాను బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను ఆస్వాదిస్తున్నానని తన మనసులోని భావాన్ని తెలిపారు. రామ్ లల్లా ఇక టెంట్ లో ఉండాల్సిన అవసరం లేదని, ఆయన గర్భగుడిలోనే ఉంటారని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాముడి ప్రధాన ఆలయాలను దర్శించానని, అన్ని భాషల్లోనూ రామాయణాన్ని విన్నానని ప్రధాని తెలిపారు.
.
.