PM Modi: కేంద్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న వార్తలు వస్తున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించనున్నారు. ప్రధాని అధ్యక్షతన సోమవారం కేంద్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఇటీవల కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రి వర్గంలో ఉన్న కేంద్రమంత్రులు, సహాయ మంత్రులు, స్వతంత్ర మంత్రులు అందరూ హాజరు కానున్నారు. 2024 లోక్సభ ఎన్నికలు, ఈ ఏడాది చివర్లో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న వేళ.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది.
ఈ సారి మంత్రివర్గ విస్తరణలో కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, యూపీ రాష్ట్రాల నుంచి ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో ఉన్న మంత్రులకు ఉద్వాసన పలికి రాజస్థాన్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నేతలకు ఈ సారి చోటు కల్పించనున్నట్టు తెలుస్తోంది. దాదాపు రెండేళ్లుగా మోడీ కేబినెట్ లో భారీ మార్పులు జరగలేదు. గత మే నెలలో ప్రభుత్వం న్యాయశాఖ మంత్రి పదవి నుంచి కిరణ్ రిజిజు ను తప్పించి ఆయన స్థానే అర్జున్ రామ్ మేఘ్వాల్ను నియమించింది.
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ సారి సమావేశాల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం చూస్తోందని ప్రచారం జరుగుతోంది. దీనిపైన కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.
ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం సహా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా చేయాల్సిన కృషిపై ఇప్పటికే బీజేపీ అగ్ర నేతలు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇదే సమయంలో రాష్ట్రాల్లో, కేంద్ర పార్టీల్లో సంస్థాగత మార్పులు, చేర్పులకు సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.