PM Modi AP, Telangana Floods| ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. వరదలు పలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. బస్సులు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా తీవ్ర స్థాయిలో ఆస్తినష్టంతో పాటు కొంతమంది చనిపోయారు కూడా. తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యం సంభవించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు తగిన సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జారీ అయిన అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రధాన మంత్రి మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో తలెత్తిన వరద సమస్య గురించి ఆరా తీశారు. వరద బాధిత ప్రాంతాల్లో జరిగిన నష్టాల గురించి తెలుసుకున్నారు.
వరద సమస్య వల్ల తీవ్ర ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. వాతావరణం అనుకూలించన వెంటనే కేంద్ర ప్రభుత్వం తరపున హెలికాప్టర్లతో సాయం అందిస్తామని ప్రధాని చెప్పినట్లు సమాచారం. భారీ వర్షాల కారణంగా సోమవారం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని స్కూళ్లు, కాలేజీల ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ లో తీవ్ర వరద సమస్య ఉన్న ప్రాంతాల్లో సిఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ముఖ్యంగా విజయవాడ పరిధిలోని సింఘ్ నగర్ ప్రాంతాల్లో వరద నష్టం తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో సహాయక చర్యలను ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆదివారం ముఖ్యమంత్రి వరద బాధిత ప్రాంతాలను సమీక్షించి బాధిత ప్రజలకు ఆహారం, నీరు అందించాలని ప్రభుత్వ ఆధికారులకు ఆదేశాలు జారీచేశారు.
భారీ వర్షాల హెచ్చరిక
జాతీయ వాతావరణ శాఖ మరో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది. మరో నాలుగు రోజుల పాటు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాల ఉండే అవకాశం ఉంది.పోలీసులు, జాతీయ సహాయక బృందాలు సహాయక చర్యలు ఇప్పటికే చేపట్టాయి. వరదల వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వ శిబిరాల్లో ఆశ్రయం కల్పించారు.