Bihar Reservations: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యా, ఉద్యోగ రంగాల్లొ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. బీహార్ ప్రభుత్వం తీసుకున్న 65 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తూ గురువారం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం వెల్లడించింది.
బీహార్ వ్యాప్తంగా కులగణన చేపట్టిన నితీష్ సర్కార్ గతేడాది నవంబర్లో ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ సమయంలోనే విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లును కూడా తీసుకువచ్చారు. ఈ బిల్లుకు రాష్ట్ర శాసన సభ కూడా ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఈ నిర్ణయంతో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన వర్గాల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెరిగాయి.