Patanjali Products: లైసెన్స్ రద్దు అయిన 14 రకాల ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశామని పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఉత్తరఖాండ్ ప్రభుత్వం పతంజలి ఉత్పత్తుల లైసెన్సులు రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 5,606 ఫ్రాంచైజీ స్టోర్లకు 14 ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పతంజలి మంగళవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఆయా ఉత్పత్తులను వెనక్కు పంపించాలని స్టోర్లకు సూచించినట్లు తెలిపింది.
మాన్యుఫాక్చరింగ్ లైసెన్స్ రద్దయిన 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసినట్లు పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీం కోర్టులో తెలిపింది. ఆయా ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న తమ ఫ్రాంచైజీ స్టోర్లకు సూచించినట్లు తెలిపింది. అంతే కాకుండా వాటికి సంబంధించిన ప్రకటనలను ఉపసంహరించుకోవాలని మీడియా సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది.
ఇప్పటికే వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చిన కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీం కోర్టు విచారణ ఎదుర్కుంటోంది. పతంజలి సంస్థ తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చినట్లు నిర్ధారణ కావటంతో ఉత్తరాఖాండ్ ప్రభుత్వం ఆ సంస్థపై చర్యలు తీసుకుంది. ఆ సంస్థకు చెందిన 14 రకాల ఉత్పత్తులు, అనుబంధ విభాగం దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు చేసింది.
Also Read: హత్రాస్ తొక్కిసలాట కేసు విచారణ..సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
ఈ క్రమంలోనే సుప్రీం కోర్టులో కేసు విచారణ జరిగింది. ఉత్తరాఖాండ్ సర్కారు వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. అఫిడవిట్ దాఖలు చేయాలని పతంజలి ఆయుర్వేద సంస్థకు ఆదేశాలిచ్చింది. దాంతో ఉత్తరాఖండ్ సర్కారు తయారీ లైసెన్స్ రద్దు చేసిన ఆ 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశామని తెలుపుతూ పతంజలి ఆయుర్వేదిక్ సంస్థ అఫిడవిట్ దాఖలు చేసింది.