Parliament : భారత పార్లమెంట్పై జరిగిన ఉగ్రదాడికి 21 ఏళ్లు అయిన నేపథ్యంలో అప్పటి ఘటనలో మరణించిన భద్రతా సిబ్బందిని స్మరించుకున్నారు పలువురు ప్రముఖులు. పార్లమెంట్ ఆవరణలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేత మల్లిఖార్జునఖర్గే, సోనియాగాంధీ నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. వారు చేసిన త్యాగానికి దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందని అన్నారు. ఆ ఘటనలో మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
లష్కరే తొయిబా ఉగ్రసంస్థకు చెందిన ఐదుగురు సాయుధులు 2001 డిసెంబర్ 13న పార్లమెంట్పై దాడి చేశారు. పార్లమెంట్ కాంప్లెక్స్లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. ఇందులో ఓ పౌరుడు, భద్రతా సిబ్బంది సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పార్లమెంట్లో 100 మంది సభ్యులు ఉన్నారు.