Lalith Jha Arrest: పార్లమెంట్లో పొగబాంబు దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న ఆరో నిందితుడు అరెస్టయ్యాడు. దాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ లలిత్ ఝా ఢిల్లీలోని ఓ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. అతన్ని స్పెషల్ సెల్కు అప్పగించారు పోలీసులు. దాదాపు రెండు రోజుల పాటు పరారీలో ఉన్నారు లలిత్ ఝా. పార్లమెంట్ లో ఘటనను వీడియో తీసి అక్కడి నుంచి పారిపోయాడు. బస్సులో రాజస్థాన్లోని నాగౌర్ చేరుకున్నాడు. తన ఇద్దరు స్నేహితులను కలుసుకుని , ఒక హోటల్లో గడిపాడు. పోలీసులు తన కోసం వెతుకుతుండడంతో అతనే మళ్లీ ఢిల్లీకి వచ్చి లొంగిపోయాడు.
విచారణలో భాగంగా నిందితులు దేశంలోని సమస్యలను ప్రస్తావించారని పోలీసులు తెలిపారు. నిరుద్యోగం గురించి మాట్లాడారని వెల్లడించారు. నిందితులను గురువారం పోలీసులు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. 15 రోజుల కస్టడీ కావాలని పోలీసులు కోరగా 7 రోజుల కస్టడీకి ఇస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు. నిందితులు ఉగ్ర చర్యకు పాల్పడ్డారని పోలీసులు కోర్టుకు తెలిపారు. పక్కా ప్రణాళికతోనే దాడికి పాల్పడ్డారని వివరించారు.
నిందితులపై ఢిల్లీ పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద కేసులు పెట్టారు. మరోవైపు భద్రతా వైఫల్యంపై లోక్సభ సెక్రటేరియట్ చర్యలు చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఇటు ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
.
.