Parliament Budget Session : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ సమావేశాలను నిర్వహిస్తారని తెలుస్తోంది. బడ్జెట్ సెషన్ లో తొలి రోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సభలో ప్రవేశపెట్టనున్నారు.
ప్రస్తుత అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తెలపనుంది. బ్రిటీష్ కాలం నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.ఈ బడ్జెట్ ఓటర్లను ఆకర్షించే తాయిలాలు, ప్రకటనలు ఉండకపోవచ్చని ఇప్పటికే నిర్మలా సీతారామన్ సంకేతాలిచ్చారు.
మహిళా రైతులకు ఈ బడ్జెట్ సమావేశాల్లో గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రెట్టింపు చేసే ప్రతిపాదనలు ఉంటాయని తెలుస్తోంది . ఇటీవల శీతాకాల సమావేశాల్లో దుండగులు పార్లమెంట్ లోకి దూకి అలజడి సృష్టించారు. ఈ పరిణామం నేపథ్యంలో పార్లమెంట్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అందుకే భద్రతను కట్టుదిట్టం చేశారు.