Parliament Attack Plan | అంతా ప్రీ ప్లాన్డే. 18 నెలల క్రితమే పురుడు పోసుకున్న ప్లాన్. మార్చిలోనే రెక్కీ. చిన్న భద్రతా వైఫల్యాన్ని గుర్తించి అనుకున్నది ఫినిష్ చేసిన ఆరుగురు సామాన్యులు. ఇంతకీ ప్లాన్ ఎలా చేశారు.. ఎలా ఎగ్జిక్యూట్ చేశారు.
Parliament Attack Plan | అంతా ప్రీ ప్లాన్డే. 18 నెలల క్రితమే పురుడు పోసుకున్న ప్లాన్. మార్చిలోనే రెక్కీ. చిన్న భద్రతా వైఫల్యాన్ని గుర్తించి అనుకున్నది ఫినిష్ చేసిన ఆరుగురు సామాన్యులు. ఇంతకీ ప్లాన్ ఎలా చేశారు.. ఎలా ఎగ్జిక్యూట్ చేశారు.
మూడంచెల భద్రతను దాటారు.. దేశం ఉలిక్కిపడేలా చేశారు..
పార్లమెంటులో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. మూడంచెల సెక్యూరిటీని దాటుకుని ఇద్దరు అగంతకులు సభలోకి చొరబడటం కలకలం రేపింది. ఆ ఇద్దరూ షూస్లో స్మోక్ బాంబులు పెట్టుకుని వచ్చి.. లోపలికి వచ్చాక వాటిని విసిరారు. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరిగిందో తెలుసుకునేలోగా ఎంపీలు పరుగులు తీశారు
స్మోక్బాంబుల దాడితో ఏం చెప్పాలనుకున్నారు? అసలు ప్లాన్ ఎలా వేశారు? ఎలా ఇంప్లిమెంట్ చేశారు?
పార్లమెంటులో పొగబాంబులతో దాడి దేనికి నిదర్శనం అనుకోవాలి. ఆరుగురు సామాన్యులు ఇంత సాహసం ఎందుకు చేశారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్లమెంట్లోకి చొరబడటం ద్వారా వాళ్లు ఏం చెప్పాలనుకున్నారు అనేదానిపై ఇప్పటికీ అయితే ఓ క్లారిటీలేదు. కానీ ప్రాథమిక దర్యాప్తులో మాత్రం.. ఇలాంటి దాడితో వారి నిరసనను బయటి ప్రపంచానికి తెలియాలని చూశారన్నది మాత్రం అర్థమవుతోంది.
స్మోక్ బాంబ్ దాడిలో మాస్టర్మైండ్ లలిత్ ఝా.. స్కెచ్, ఇంప్లిమెంటేషన్ ఐడియా అతనిదే.. ఇంకా పరారీలోనే ఆరో నిందితుడు ఝా
పార్లమెంట్లో దాడి ఘటనకు కారకులైన ఆరుగురు కూడా సోషల్ మీడియా ద్వారానే పరిచయమయ్యారు. భగత్సింగ్ ఫ్యాన్ క్లబ్ పేరుతో ఏర్పాటైన సోషల్ మీడియా పేజ్ తోనే వీరంతా కలిశారు. వీరంతా ఫస్ట్ టైమ్ సంవత్సరన్నర క్రితమే మైసూరులో కలుసుకున్నారు. అప్పుడే ఈ ప్లాన్కు రచన చేశారు. ఇందుకోసం వారంతా సిగ్నల్ యాప్ను వాడారు. ఆ యాప్తోనే ఎన్ క్రిప్టడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను వాడుకుంటూ తరుచుగా చాట్ చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
మార్చిలో జరిగిన బడ్జెట్ సెషన్స్ టైంలో రెక్కీ.. చిన్న లూప్హోల్ను క్యాచ్ చేసిన ఆ ఇద్దరు
ఇప్పుడు లోక్సభలోకి దూకిన ఇద్దరు ఆగంతకులు.. బడ్జెట్సెషన్స్ సందర్భంగా రెక్కీ కూడా చేశారు. మార్చిలో మరోరంజన్, సాగర్శర్మ ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ప్రాక్టికల్గా డెమో చేసుకున్నారు. మనోరంజన్ అప్పుడు కూడా ఓ ఎంపీ నుంచి విజిటర్ పాస్ తీసుకుని లోనికి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు సాగర్ శర్మ పార్లమెంట్ బయట సెక్యూరిటీ, ఎస్కేప్ రూట్స్ పై రెక్కీ చేశాడు. ఇలా తరుచుగా రెక్కీలు చేస్తూ.. పార్లమెంట్లోకి ఎంట్రీ కోసం భద్రతా వైఫల్యాన్ని గుర్తించారు. అదే షూ తనిఖీ చేయకపోవడం. లోనికి వెళ్లాలి అనుకుంటే బాడీ స్కానర్లు, మెటల్ డిటక్టర్స్ తో చెక్ చేస్తున్నారు తప్ప.. షూలను మాత్రం తనిఖీ చేయడం లేదని తమ రెక్కీతో నిర్ధారణకు వచ్చారు. ఇక అప్పటి నుంచి కూడా సిగ్నల్ యాప్లో చాటింగ్ చేసుకుంటూనే ఉన్నారు. డిసెంబర్లో ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించారు.
డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ మధ్యలో నలుగురు వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. గురుగ్రాంలోని విక్కీ ఇంట్లో దిగారు. అదే రోజు వారి దగ్గరకు లలిత్ ఝా వచ్చి చేరాడు. ఘటనకు ముందురోజు మహారాష్ట్ర నుంచి అమోల్ స్మోక్ బాంబులను తీసుకువచ్చాడు. ఘటన జరిగేరోజు ఇండియా గేట్ వద్ద ఆ స్మోక్బాంబులను పంచుకున్నాడు. అంతకుముందే.. ఎంపీ ప్రతాప్ సింహా పీఏ నుంచి విజిటర్ పాస్ పొందారు. 11 గంటల ప్రాంతంలో లోనికి వెళ్లి తమ ప్లాన్ ప్రకారం చేయాల్సింది చేశారు. లోపలికి వెళ్లిన సాగర్ శర్మ, మనోరంజన్.. లోక్సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకి స్మోక్ క్యాన్లు ప్రయోగించారు. ఇక పార్లమెంట్ కాంపౌండ్ బయట నీలం, ఆమోల్ షిండే.. గేట్ వద్ద పొగబాంబు ప్రయోగించి నినాదాలు చేశారు. వాటిని మొబైల్ కెమేరాల్లో విక్కీ శర్మ, లలిత్ ఝా షూట్ చేశారు. నీలం, ఆమోల్ షిండేను పోలీసులు పట్టుకోగానే విక్కీ శర్మ, లలిత్ ఝా పరారయ్యారు. అనంతరం విక్కీ శర్మను, అతని భార్యను గురుగ్రాంలో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై నేరపూరిత కుట్ర, పార్లమెంట్ కార్యక్రమాలను అడ్డుకోవడం, అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టడం వంటి కారణాలతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఆరో నిందితునిగా ఉన్న లలిత్ ఝా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం మొదలైన దగ్గర నుంచి దాని ప్రారంభోత్సవం జరిగే వరకు కేంద్రం చేసిన హడావుడి అంతాఇంతా కాదు. భవనానికి సంబంధించిన రాళ్లు అక్కడ నుంచి తీసుకొచ్చాం.. ఇక్కడ నుంచి మోసుకొచ్చాం.. ప్రపంచంలో మాదే బెస్ట్ పార్లమెంట్ అంటూ డబ్బా కొటుకున్న నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. పార్లమెంట్ ఎన్ని వందల కోట్లతో నిర్మిస్తేనేం? సెక్యూరిటీ కదా ముఖ్యం. ఎంపీల భద్రతకే భరోసా లేకపోతే సామాన్యులు మాటేంటి? వాళ్లకి ఏం సమాధానం చెబుతారు.? ప్రజస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్ హౌస్పై దాడి జరగడమంటే యావత్ దేశంపై జరిగినట్టే కదా? సరిగ్గా 22ఏళ్ల క్రితం ఇదే జరిగింది కదా.. మరి ఆ లోపాల నుంచి నేర్చుకున్న పాఠాలేంటి? లోక్సభలోకి ఆగంతకులు దూసుకురావడం.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. షూ లో నుంచి పొగను బయటకు వదలడం క్షణాల వ్యవధిలో జరిగిపోయాయి. ఇలాంటి ఘటనలు సెక్యూరిటీ వైఫల్యాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. పార్లమెంట్ సెక్యూరిటీ ఫెయిల్యూర్పై ప్రజలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఆగంతకులకు లోపల వ్యక్తుల నుంచి మద్దతు ఉందా? ప్రజాస్వామ్య సంస్థల రక్షణలో ప్రభుత్వ సామర్థ్యం ఇదేనా?
ఆగంతకులు లోపలికి కలర్ గ్యాస్ టిన్స్ తీసుకెళ్లారని.. పెద్ద ప్రమాదమేమి కాదని చేతులు దులుపేసుకుంటే సరిపోదు కదా..? ఆ గ్యాస్ ప్లేస్లో గ్రెనేడ్లు ఉండి ఉంటే ఏం జరిగేది? వామ్మో తలుచుకుంటేనే భయం పుడుతుంది. దేశంలో జరిగే ప్రతి పరిణామాన్ని యావత్ ప్రపంచం ఎంతో నిశీతంగా పరిశీలిస్తున్న వేళ లోక్సభలోకి దుండగులు దూసుకురావడంపై కేంద్రం కచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందులోనూ కొత్త పార్లమెంట్ భవనంలో ఇలా జరగడం భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ దాడి మన ప్రజాస్వామ్య సంస్థలను రక్షించడంలో ప్రభుత్వ సామర్థ్యంపైనా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. పార్లమెంటు విజిటర్స్ని కింద నుంచి మీద వరకు అణువణువు చెక్ చేసి కాని లోపలికి పంపరు. ఇన్నర్లో దాచుకుంటారేమోనని తొడల మధ్య తడిమి చూస్తారు కూడా. జేబులో పెన్ను ఉన్నా తీసేస్తే గాని లోపలికి పంపరు. అలాంటిది ఇద్దరు స్మోక్ స్టిక్స్ పట్టుకుపోయారు అంటే లోపల వ్యక్తుల నుంచి సపోర్ట్ ఉందానన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా పార్లమెంట్ భద్రమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగానే హెచ్చరించినా హోంశాఖ పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐబీ అధికారులు రెండు రోజుల ముందుగానే అమిత్షాకు బ్రీఫింగ్ ఇచ్చాయని అయినా పట్టనట్టుగా ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఆరోపిస్తున్నారు. దీనిపై సభలో అమిత్ షా మాట్లాడకుంగా.. డిఫెన్స్ మినిస్టర్ తో మాట్లాడిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.